తెలంగాణకు రూ.659 కోట్లు, ఏపీకి రూ.918 కోట్లు, పేదలకు ఆపన్నహస్తం, రైతులను ఆదుకుంటాం: కిషన్ రెడ్డి
కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పేదలను అన్నివిధాలుగా ఆదుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పని లేనందున రేషన్, నగదు అందజేశామని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం లేకుంటే ఆయా రాష్ట్రాలు నిబంధనల్లో మార్పులు చేసుకునే వీలు ఉందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.
పేదల జన్ ధన్ ఖాతాలో రూ.500 నగదు జమచేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రూ.659 కోట్లు విడుదల చేశామని... ఆంధ్రప్రదేశ్కు రూ.918 కోట్లు అందజేశామని తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేదలతోపాటు రైతులను ఆదుకుంటామని చెప్పారు. అన్నిరంగాలకు చేయూతనిస్తామని వెల్లడించారు.
గుజరాత్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ మత్య్సకారులను సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టంచేశారు. దీనిపై ఇప్పటికే గుజరాత్ సీఎం విజయ్ రుపానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సీఎం జగన్కు సూచించానని తెలిపారు. తాను స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడనని గుర్తుచేశారు. వీలైనంత త్వరగా వారు రాష్ట్రానికి చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.