అందరి ఓట్లు అడిగాడు, తన ఓటు వేసుకోవడం మరిచాడు: ఆగమైన 'ఆగంరెడ్డి'
హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోను టీఆర్ఎస్ హవా కనిపించింది. ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. 59 శాతం గెలుపు వారిదే. 20 శాతం చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. తొలి విడతలో తెలంగాణవ్యాప్తంగా 4,470 సర్పంచ్ చోట్ల ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఏకగ్రీవం ఉన్నాయి.
ఇందులో టీఆర్ఎస్ 2700 వరకు, కాంగ్రెస్, 925 వరకు, టీడీపీ 31, బీజేపీ 70 స్థానాల వరకు, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 760 వరకు చోట్ల గెలుపొందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తక్కువగా 78.47 శాతం ఓటింగ్ నమోదయింది. మూడు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
తనను తానే ఓడించుకున్నాడు
పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులు ఒకటి, రెండు ఓట్లతో ఓడిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రంగాపురంలో రామిడి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఈయన టీఆర్ఎస్ మద్దతుదారు. మర్రి ఆగంరెడ్డి కాంగ్రెస్ మద్దతుదారు. ప్రభాకర్ రెడ్డికి 227 ఓట్లు రాగా, ఆగంరెడ్డికి 226 ఓట్లు వచ్చాయి. ఆసక్తికర విషయం ఏమంటే ప్రచారంలో నిమగ్నమైన ఆగంరెడ్డి, ఆయన భార్య మాత్రం ఓటు వేయలేదు. వీరిద్దరు ఓటు వేస్తే ఆగంరెడ్డికి 228 ఓట్లు వచ్చేవి. ఎంత ప్రచారం చేసినా, వీరిని మాత్రం వీరే ఓడించుకున్నారు.
ఒక్క ఓటుతో గెలుపోటములు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం కోయపెల్లి గ్రామానికి చెందిన ప్రీతి.. ప్రత్యర్థి సుహాసినిపై ఒక్క ఓటుతో గెలుపొందారు. ప్రీతికి 116 ఓట్లు రాగా, సుహాసినికి 115 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మమతకు 224 ఓట్లు, ప్రత్యర్థి వెంకటమ్మకు 223 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
తెరాస హవా
పంచాయతీ ఎన్నికల్లో ఏ జిల్లాలోను తెరాస కాకుండా ఇతర పార్టీల మద్దతుదారులు ఆధిపత్యం కనబరచలేదు. అదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్ రూరల్ వంటి జిల్లాల్లో అయితే మరీ వెనుకడ్డారు. తెరాస వందకు పైగా స్థానాలు సాధిస్తే, ఇతర పార్టీలు పది ఇరవైకి పరిమితమయ్యాయి. నల్గొండ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీమ్, మబూబాబాద్ వంటి జిల్లాల్లో మాత్రం తెరాసతో పోటీ పడ్డాయి. పదింట తెరాస మద్దతుదారులు అయిదు గెలిస్తే, కాంగ్రెస్ మద్దతుదారులు నాలుగైదు గెలుచుకున్నారు.