10th marks:గ్రేడింగ్స్, పాయింట్లు ఇలా..? కీలకమైన ఎఫ్ ఏ, అబ్సెంట్ అయితే ఫెయిలే...?
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసింది. కరోనా వైరస్ వ్యాపి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థుల మార్కులు ఎలా ఉండనున్నాయి..? గ్రేడింగ్ ఎలా ఇవ్వబోతున్నారు అనే ప్రశ్న ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతోంది. ఇంటర్నల్ మార్కులతోనే గ్రేడింగ్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ గ్రేడింగ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చుద్దాం. పదండి.
Recommended Video
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు..
5 లక్షల మంది విద్యార్థులు..
రాష్ట్రంలో మొత్తం 5 లక్షల పైచిలుకు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 5 లక్షల 9వేల 79 మంది కాగా... ప్రైవేట్ విద్యార్థులు 25 వేల 824 మంది ఉన్నారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 5 లక్షల 34 వేల 903గా ఉంది. పదో తరగతి ఆరు సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ ద్వారా 20 మార్కులు ఇస్తారు. ఎఫ్ ఏ పరీక్షలను 2 నెలలకోసారి.. ఐదుసార్లు నిర్వహిస్తారు. కానీ రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
గ్రేడింగ్స్, పాయింట్లు
విద్యార్థులకు సంబంధించి ఎఫ్ ఏ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే సేకరించింది. దాని ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్స్ ఇస్తారు. ఈ ప్రాసెస్ సక్రమంగా పూర్తి చేసి.. వారం పదిరోజుల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్నల్ పరీక్షలకు హాజరుకానీ విద్యార్థులు మాత్రమే ఫెయిలయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యార్థులు ఇదివరకే ఎఫ్ ఏకు హాజరైతే ఇబ్బంది లేదు.. కానీ పాల్గొనని వారికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు.
డీ 2 గ్రేడ్
విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీసీఈ విధానంలో 8 గ్రేడ్లు ఇస్తారు. 91 నుంచి 100 మార్కులు వస్తే ఆ విద్యార్థికి ఏ1 గ్రేడ్ ఇచ్చి.. 10 పాయింట్లు ఇస్తారు. జీరో నుంచి 34 మార్కులు వస్తే డీ 2 గ్రేడ్ ఇచ్చి, 3 పాయింట్లు మాత్రమే ఇస్తారు. డీ 2 గ్రేడ్ అంటే ఫెయిల్గా పరిగణిస్తారు. అయితే ఇంటర్నల్ మార్కుల విషయంలో ప్రైవేట్ స్కూల్స్.. ఫుల్ వేసుకుంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా వేయరనే అపవాదు ఉంది.
10, 20 మార్కులు
ఎఫ్ ఏ 1,2,3,4లో ప్రతీ సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున 80 మార్కులు ఉంటారు. మొత్తంలో సగటు తీసుకొని... దానికి ఐదురెట్లు పెంచుతారు. ఆ మార్కులను విద్యార్థికి వచ్చిన మార్కులుగా పరిగణిస్తారు. తర్వాత గ్రేడ్లు, పాయింట్లను కేటాయిస్తారు. ఒక సబ్జెక్టుకు సంబంధించి 4 ఎఫ్ ఏ పరీక్షలు సగటున 10 మార్కులు వస్తే పూర్తిస్థాయి మార్కులు 50గా నిర్ధారిస్తారు. 4 ఎఫ్ఏలో 20 మార్కులు వస్తే మొత్తం మార్కులు 100గా పేర్కొంటారు. అలా విద్యార్థులకు మార్కులను ప్రకటిస్తారు.
ఇవీ గ్రేడ్లు
91 నుంచి 100 మార్కులు వస్తే ఏ1 గ్రేడ్ 10 పాయింట్లు ఇస్తారు. 81 నుంచి 90 మార్కులు వస్తే ఏ2 గ్రేడ్ ఇచ్చి 9 పాయింట్లు ఇస్తారు. 71 నుంచి 80 మార్కులు ఇస్తే బీ1 గ్రేడ్ ఇచ్చి 8 పాయింట్లు ఇస్తారు. 61 నుంచి 70 మార్కులు వస్తే బీ 2 గ్రేడ్ ఇచ్చి 7 పాయింట్లు కేటాయిస్తారు. 51 నుంచి 60 మార్కులు వస్తే సీ 1 గ్రేడ్ ఇచ్చి 6 పాయింట్లు ఇస్తారు. 41 నుంచి 50 మార్కులు వస్తే సీ 2 గ్రేడ్ ఇచ్చి 5 పాయింట్లు.. 35 నుంచి 40 మార్కులు వస్తే డీ 1 గ్రేడ్ ఇచ్చి 4 పాయింట్లు, 0 నుంచి 34 మార్కులు వస్తే డీ 2 గ్రేడ్ ఇచ్చి 3 పాయింట్లను కూటాయిస్తారు.