కొండాకోనల్లో వైభవంగా పెద్దగట్టు జాతర .... మేడారం తరువాత అతిపెద్ద జాతర
కొండా కోనల్లో వెలసిన ఓ లింగా శంభు లింగా.. అంటూ పెద్దగట్టు జాతరలో జనం చిందేస్తుంటే గొల్లగట్టు గొంతు కలిపి పరవశించిపోతుంది. లింగమంతుల జాతర వైభవంగా జరుగుతుంది. మేడారం జాతర తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న తెలంగాణలో జరిగే అపురూపమైన జాతర పెద్ద గట్టు జాతర .ఈ జాతరకు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు. రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించారని, ఆ రాజు నిర్మించిన గ్రామమే దురాజ్ పల్లిగా పేరొందిందని మరొక కథనం ప్రచారంలో ఉంది. అంతేకాదు దురాజ్ పల్లి సమీపంలోని ఉండ్రు గొండ గ్రామంలో శైవ వైష్ణవాలు వర్ధిల్లాయని చారిత్రక ఆనవాళ్ళు చెప్తున్నాయి. దీని శివారులో ఏడెనిమిది కొండగట్టులు ఉన్న అటవీ ప్రాంతం ఉండటంతో గతంలో పెద్దగట్టు జాతర ఇక్కడే జరిగేదని చెప్తుంటారు.
మేడారం తరువాత అతి పెద్ద జాతర
రెండేళ్లకు ఒకసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టిపూజ మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. ఆదివారం ప్రారంభమైన ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.
ఐదురోజుల పాటు జరిగే అపురూపమైన జాతర.. తొలిరోజు దేవర పెట్టె తరలింపు
సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్ద(గొల్ల)గట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మపెట్టె) తరలింపు కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి హాజరయ్యారు. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామంలో దేవరపెట్టె వద్ద దేవతా విగ్రహాలకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పెట్టెను మోసి తరలింపును ప్రారంభించారు. మహిళల కోలాటాలు, భేరీలు, గజ్జెల చప్పుళ్లు, కత్తులు, కటారుల విన్యాసం, భక్తుల జయజయధ్వానాల నడుమ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె పెద్దగట్టుకు చేరుకుంది. పూజా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట కలెక్టర్ అమయ్కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఆదివారం జాతర తొలిరోజున భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు.
రెండో రోజు కంకణ అలంకరణలు.... స్వామివారి కొలుపులు
రెండోరోజు యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పించారు. ఇక జంతుబలి ఉండనే ఉంది. జాతరిక జనసంద్రమవుతుంది. భక్తుల కొలుపుల తో లింగమంతుల స్వామి పరవశించిపోతాడు. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే మహిళలు తడిబట్టలతో, పసుపు కుంకుమలతో, బోనాల కుండలను పట్టుకొని స్వామికి నివేదించి సంతాన భాగ్యం కలిగించమని వేడుకున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి.
మూడవరోజు కీలక ఘట్టం.. వైభవంగా స్వామివారి చంద్ర పట్నం
ఇక మూడో రోజైన మంగళవారం చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. జాతరలో కీలకమైన ‘చంద్రపట్నం' తంతు వైభవంగా జరిగింది. తొలుత పసుపు, బియ్యం పిండి, కుంకుమతో ఆలయ ఆవరణలో ఆకర్షణీయంగా చంద్రపట్నం వేసి దేవరపెట్టెను ప్రతిష్టింపజేశారు. అనంతరం లింగమంతులస్వామి, మాణిక్యమ్మ కల్యాణ మహోత్సవాన్ని యాదవ పూజారులు సంప్రదాయరీతిలో పూర్తి చేశారు. కల్యాణ తంతు కనుల పండుగగా సాగింది.
వరుడు లింగమంతుల స్వామి.... వధువు మాణిక్యమ్మ
వరుడు లింగమంతుల స్వామి తరఫున మెంతబోయిన వంశీయులు, వధువు మాణిక్యమ్మ తరఫున మున్న వంశంవారు పరిణయ వేడుకలో పాల్గొన్నారు. దేవరపెట్టె పూజారులుగా తండు వంశీయులు కల్యాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. పోతురాజు, భైరవుడి వేషధారణలో ఇరువర్గాలవారు సంప్రదాయ పద్ధతిలో కత్తులు, కటారులు తిప్పి స్వామికి మొక్కులు చెల్లించారు. మూడో రోజు సైతం భక్తులు జాతరకు భారీగా తరలివచ్చారు. మహిళలు బోనమెత్తి భక్తి పారవశ్యంతో నృత్యాలు చేయగా.. పురుషులు భేరీల మోతలు, గజ్జెల చప్పుళ్లు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
4, 5 రోజుల్లో దేవరపెట్టె కేసారం గ్రామానికి తరలింపు.. మకర తోరణం తొలగింపు
బుధవారం జాతరలో భాగంగా నెలవారం వేడుక నిర్వహించనున్నారు.దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. దీంతో ఐదురోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది. శంభు లింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల తిరిగి తమ తమ స్వగ్రామాలకు పయనమవుతారు. అనాదిగా సాంప్రదాయంగా, లింగమంతుల ఆచారంగా వస్తున్న పెద్దగట్టు జాతరలో మొక్కులు చెల్లించి రెండేళ్ల తర్వాత మరోమారు ఇంతే ఘనంగా జాతరకు వస్తామని లింగమంతుల స్వామి కి చెప్పి మరీ వెళ్తారు. ఐదు రోజులపాటు కొండకోనల్లో ఆటపాటలతో భేరీల చప్పుళ్ళతో, ఆ లింగమయ్య నామస్మరణలో భక్తులు ఆనందపారవశ్యంతో పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు.