వీడియో వైరల్ : హ్యాట్సాఫ్ డాక్టర్ .. కరోనా వారియర్కు గ్రాండ్ వెల్కమ్ పలికిన అపార్ట్మెంట్ వాసులు
హైదరాబాద్ : కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. అయితే ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇక కరోనావైరస్ పై ముందునుంచి పోరాడుతున్న వారిలో ముందువరసలో నిలిచారు డాక్టర్లు. వైద్యులతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యేలా చూసేందుకు పోలీసులు, ప్రతి చిన్న సమాచారంను ప్రజలకు చేరవేసేందుకు జర్నలిస్టులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనా వారియర్స్కు మద్దతుగా నిలిచే క్రమంలో ఓ సారి దేశమంతా వారి ఇళ్లలోని బాల్కనీలో నిల్చుని చప్పట్లు, గంటలు కొట్టగా, మరోసారి దీపాలు వెలిగించి కరోనావారియర్స్కు అండగా నిలించింది. ఇక కరోనావైరస్ పేషెంట్ల చికిత్సలో కీలకంగా వ్యవహరిస్తున్న వైద్యులు హాస్పిటల్స్కు పరిమితమై సేవలందించి చాలా కాలం తర్వాత ఇళ్లకు చేరుకుంటున్నారు. అలాంటి వారికి ఘనస్వాగతం పలుకుతున్నారు అపార్ట్మెంట్ నివాసితులు.
Recommended Video
తాజాగా గాంధీ హాస్పిటల్లో విజయశ్రీ అనే వైద్యురాలు 2వారాల పాటు ఇంటికి దూరంగా ఉండి హాస్టిల్కే పరిమితమై కరోనావైరస్ పేషంట్లకు చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత సైనిక్పురిలోని తన ఇంటికి వచ్చిన డాక్టర్ విజయశ్రీకు ఆమె అపార్ట్మెంట్ సొసైటీ గ్రాండ్ వెల్కమ్ పలికింది. తను ఇంటికి రాగానే ఫ్లాట్స్లో ఉన్న కుటుంబాలన్నీ బయటకు వచ్చి చప్పట్లతో ఆమెకు ఘనస్వాగతం పలికాయి. ఇక ఘన స్వాగతం పలకిన ఆ కుటుంబాలకు డాక్టర్ విజయశ్రీ చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మద్దతుగా నిలిచి తనను అభినందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక అపార్ట్మెంట్లో నివసిస్తున్నకుటుంబాలు చప్పట్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే మే 3వ తేదీ ఉదయం 9:30 గంటలకు కరోనా వారియర్స్ కృషిని సేవను అభినందిస్తూ త్రివిధ దళాలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఒక ప్రకటన చేశారు. కరోనావైరస్ చికిత్స అందిస్తున్న ప్రత్యేక హాస్పిటల్స్పై హెలికాఫ్టర్ల నుంచి పూల వర్షం కురిపించనున్నారు. ఇక హైదరాబాదు విషయానికొస్తే ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల గాంధీ హాస్పిటల్పై హెలికాఫ్టర్ నుంచి పూల వర్షం కురిపించనున్నారు.
కరోనావారియర్కు గ్రాండ్ వెల్కమ్ పలికిన అపార్ట్మెంట్ వాసులు. #lockdownindia #CoronaUpdates pic.twitter.com/r6GXIHxSX4
— oneindiatelugu (@oneindiatelugu) May 2, 2020