కేసీఆర్ తాతా... చర్చలకు పిలవండి అని దీనంగా అడిగిన చిన్నారి.. కళ్ళు చెమర్చే సంఘటన
ఆర్టీసీ కార్మిక కుటుంబాల వేదన అరణ్య రోదనగా మారింది. యాభై రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్న పట్టించుకోని సీఎం కేసీఆర్ తీరు ఇప్పుడు ఆర్టీసీ కార్మిక కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, కార్మిక కుటుంబాల చిన్నారులు సైతం తమకు న్యాయం చేయమని ప్రాధేయ పడుతున్నా, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నామని కంటతడి పెడుతున్నా కనికరించని సర్కారు తీరు అందరికీ బాధను కలిగిస్తుంది.
51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్ష
తల్లి బాధ చెప్తూ కన్నీరు పెట్టిన చిన్నారి .. కేసీఆర్ తాతా అంటూ విజ్ఞప్తి
నిన్నటికి నిన్న హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికులు నిరసన దీక్ష చేశారు. తమ బిడ్డలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఆ సమయంలో ఎంజీబీఎస్ లోని మహాత్ముడి విగ్రహం సాక్షిగా ఓ చిన్నారి కంటతడి పెట్టింది. ఆర్టీసీ కార్మికురాలైన తన తల్లి బాధను చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. కెసిఆర్ తాత ఇకనైనా చర్చలకు పిలవండి అంటూ చాలా దీనంగా అభ్యర్థించింది. ఆ చిన్నారి చేసిన అభ్యర్థన అక్కడ ఉన్న వారందరికీ హృదయాలను కదిలించింది కానీ సీఎం కేసీఆర్ హృదయాన్ని మాత్రం కరిగించలేకపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చెప్పిందంటే..
తమ కుటుంబ పరిస్థితి చెప్పిన చిన్నారి ... స్కూల్ లో ఫీజ్ కట్టకుంటే పంపించేశారని ఆవేదన
కెసిఆర్ తాతకు నమస్కారాలు.. మా అమ్మకు మూడు నెలలుగా పైసలు లేవు. దసరా, దీపావళి పండుగకు కొత్త బట్టలు కూడా కొనలేదు. స్కూలు ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష రాయనివ్వలేదు. స్కూల్ నుండి పంపించేశారు. చర్చలకు పిలవాలని కేసీఆర్ తాతను కోరుతున్నానని ఆ చిన్నారి చేసిన అభ్యర్థన, ఆర్టీసీ కార్మిక కుటుంబ పరిస్థితులకు అడ్డం పడుతుంది. అక్కడ ఉన్న వారందరినీ ఆవేదనకు గురి చేసింది.
చిన్నారుల అభ్యర్థన తో అయినా మనసు మార్చుకోవాలని చెప్తున్న కార్మికులు
తన తల్లి వేదనను అందరికీ అర్థమయ్యేలా చెప్పిన చిన్నారి తన మాటలతో అందరినీకంటతడి పెట్టించింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం, ఆర్టీసీని కాపాడుకోవడం కోసం ఆందోళన చేస్తున్న ఆర్టీసీ మహిళా కార్మికులు సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ,ఈ చిన్నారులను చూసైనా మనసు మార్చుకోవాలని కోరుతున్నారు. చర్చలకు పిలిచి సాన్కూలంగా సమస్యల పరిష్కారానికి చర్చించాలని కోరుతున్నారు.
కార్మిక కుటుంబాలు రోడ్డున పడినా, చిన్నారులు ప్రాధేయ పడినా స్పందించరా ?
మరోవైపు ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులపై సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆర్టీసి జెఎసి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు . తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమీక్షను సోమ లేదా మంగళవారం నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీ కార్మికులు 52రోజులుగా ఆందోళన చేస్తున్నా , ఏంటో మంది ప్రాణాలు వదులుతున్నా , పిల్లలు ప్రాధేయపడుతున్నా ఇంత కఠినంగా వ్యవహరించే సర్కార్ మరొకటి ఉండదేమో అని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతుంది.