నానమ్మ మృతిని తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక ఒత్తిడితో ఓ ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదు సమీపంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన పి.రాజ్కుమార్, సువర్ణ దంపతుల కుమారుడు పి.శివసృజన్ కుమార్(19) కుత్బుల్లాపూర్ మండల దుండిగల్ గ్రామ పరిధిలోని ఎరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. డీపోచంపల్లిలోని సాయిగణేష్ బాయ్స్ హాస్టల్లో నివాసముంటున్నాడు.
చదువులో చురుగ్గా ఉండే శివసృజన్ కుమార్ మొదట్లో ఎవరితోనూ కలవకుండా మొహమాటంగా ఉండేవాడు. కాగా, శివసృజన్ కుమార్ తన నానమ్మ(సుభద్ర) అంటే ఎంతో ఇష్టం. ఏడాది క్రితం ఆమె మృతి చెందడంతో తరుచూ నానమ్మ ధ్యాసలోనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాను ఉంటున్న గదిలో కొక్కానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీన్ని గుర్తించిన హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమందించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద నాలుగు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ లభించింది. అందులో తనకు మంచి శాస్త్రవేత్త కావాలనుందని, అయితే తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఏదీ తేల్చుకోలేకపోతున్నాని అన్నాడు.
తనకు నానమ్మంటే చాలా ఇష్టమని ఆమె మృతిని తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ తనను ప్రేమించే తల్లిదండ్రులు, బాబాయిలను మన్నించాలని కోరాడు.