గ్రేటర్ లో గులాబీని నిలువరించేందుకు మహాకూటమి "మాస్టర్" ప్లాన్..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఒక పార్టీ పై మరో పార్టీ ఆదిక్యత సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు పార్టీ నాయకులు. ఇందులో భాగంగా గ్రేటర్ పరిదిలో అదికార పార్టీ గెలుపును అడ్డుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. సిట్టింగ్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి అదికార పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు పావులు కదుపుతున్నారు నాయకులు. ముఖ్యంగా సికిందరాబాద్ లో టీ. పద్మారావును ఓడించేందుకు జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ను రంగంలోకి దించేదుకు మహాకూటమి పెద్దలు మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్టు తెలుస్తోంది.
వేడెక్కిన టీ రాజకీయం..! గెలుపు గర్రాల కోసం వేట..!
తెలంగాణలో ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. అధికార పార్టీ తీసుకున్న అనూహ్య నిర్ణయానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఆ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉందని, అదే జరిగితే మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమవుతుందని ఆ పార్టీలు జతకట్టాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే పొత్తుల కోసం ముందడుగు వేస్తున్నాయి.
బలమైన టీఆర్ఎస్ నేతలకు ధీటుగా రంగంలోకి కూటమి నాయకులు..!!
ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి మధ్య చర్చలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఆయా పార్టీల పొత్తుకు సంబంధించిన చర్చలు పూర్తి చేసుకున్నాయి. ఇక సీట్ల సర్ధుబాట్లు కూడా అయిపోతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయిన వెంటనే ఈ పార్టీలన్నీ కలిపి కొద్దిరోజుల్లో మహాకూటమిని అధికారికంగా ప్రకటించనున్నాయని సమాచారం. సీట్ల సర్ధుబాటు పూర్తవకముందే మహాకూటమిలోని పార్టీలన్నీ కీలక స్థానంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారనుంది.
గ్రేటర్ పై కూటమి నజర్..! సికిందరాబాద్ బరిలో కోదండరాం..!
గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీఆర్ఎస్ కైవశం చేసుకోవడం, అక్కడ గెలిచిన టీ పద్మారావుగౌడ్కు మంత్రి పదవి కూడా ఇవ్వడం వంటి కారణాలతో ఈ స్థానం ఆ పార్టీకి కీలకమైనది. అందుకే మహాకూటమి కన్ను ఈ స్థానంపై పడిందట. ఇక్కడ టీఆర్ఎస్ను ఓడిస్తే గట్టి దెబ్బ కొట్టినట్లు అవుతుందని భావిస్తున్న టీడీపీ-కాంగ్రెస్, ఈ స్థానంలో మహాకూటమి అభ్యర్ధిగా తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సొంత ఇలాకా కావడం కోదండరాం కి కలిసొచ్చే అంశం..! గెలిసే అవకాశాలు ఎక్కువే..!
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉండడం, మాణికేశ్వర్నగర్, అడ్డగుట్ట ఏరియాలు ఈ నియోజకవర్గంలో ఉండడంతో పాటు కోదండరామ్ నివాసం తార్నాక కూడా దీని పరిధిలోనే ఉండడంతో ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ పార్టీల మధ్య దీని గురించి చర్చలు జరిగాయని, పోటీ చేసేందుకు కోదండరామ్ కూడా ఒప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇతర పార్టీలకు చెందిన నేతలతో పాటు, స్థానికులు కూడా ఆయన ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలను కొట్టి పారేయలేమని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.దీంతో కోదండరాం ప్రభావం ఇక్కడ బాగానే పని చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.