తెలంగాణలో మహా కూటమి.. లక్ష్యం టీఆర్ఎస్ ఓటమి..
తెలంగాణ రాజకీయాల్లో మహా కూటమి అనే పదం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ నాటి కాంగ్రేస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడి విఫలమైన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడి పోయాక ఇప్పుడు తెలంగాణలో మహా కూటమి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బలమైన కేసీఆర్ ను గద్దె దించాలంటే కచ్చితంగా ప్రతిపక్షాల ఐక్యత అవసరమన్న అభిప్రాయం వ్యక్త మౌతున్న నేపథ్యంలో వేదికను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో పురుడు పోసుకుంటున్న మహా కూటమిలో బీజేపీ, సిపిఎం పార్టీలు మాత్రం చేరడం లేదు. కాంగ్రెస్,తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సిపిఐ తో పాటు మరికొన్ని చిన్నాచితకా పార్టీలతో ఈ కూటమి ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భావసారుప్యత కల్గిన పార్టీలుగా చెప్పుకుంటూ వీరు మహా కూటమిని నిర్మించనున్నారు. అయితే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాని ఎన్నికల్లో పొత్తుల అంశం అత్యంత కీలకం కాబోతోంది.
మహా కూటమిలో కాంగ్రెస్ అత్యంత బలమైన పార్టీ. ఆ పార్టీకి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. పటిష్టమైన నాయకత్వం, బలమైన యంత్రాంగం, వేల సంఖ్యలో కార్యకర్తలున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నాయకులంతా ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి పట్టున్న ఆరేడు నియోజకవర్గాల్లో మినహా అన్ని చోట్ల పోటీ చేయడానికి కాంగ్రెస్ కు గట్టి అభ్యర్థులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు ఆ పార్టీకి ప్రాణ సంకటంగా మారే ఛాన్స్ ఉంది.
మహకూటమి అనివార్యమైతే తల నొప్పిగా మారనున్న సీట్ల సర్ధుబాటు ..
కాగా పొత్తులు అనివార్యమైతే కొన్ని జిల్లాల్లో వికటించే అవకాశాలు కూడా లేకపోలేదు. రంగారెడ్డి,నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో సీట్ల కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో తెలుగుదేశం,సిపిఐ తో పాటు కోదండరాం నేత్రుత్వంలోని తెలంగాణ జన సమితి కూడా అధిక సంఖ్యలో సీట్లు కావాలని పట్టు పట్టే అవకాశం ఉంది.. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పొత్తు దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటే రంగారెడ్డి జిల్లాలోని చాలా నియోజకవర్గాలను తెలుగుదేశానికి వదిలిపెట్టాల్సి వస్తుంది. సెటిలర్స్ అధికంగా ఉన్న ప్రాంతాలను టీడీపీకి కాంగ్రెస్ వదిలేయాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు కూడా మంచి పట్టుంది. ఎల్.బి నగర్ తెలుగుదేశానికి సిట్టింగ్ సీటు. అయితే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించడం సాధ్యమయ్యే పని కాదు. ఇక మహేశ్వరంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. కాని ఆ సీటు టీడీపీ సిట్టింగ్ సీటు. ఇక కత్భుల్లాపూర్, శేరి లింగంపల్లి, రాజేంద్ర నగర్ ,జూబ్లీహిల్స్ ,సనత్నగర్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
నల్గొండలో కోదాడ,మిర్యాలగూడా, దేవరకొండ సీటు కోసం తెలుగుదేశం పోటీ పడే అవకాశముంది. మహబూబ్ నగర్ లో వనపర్తి సీటు విషయంలో కూడా కాంగ్రెస్, టీడీపీ మధ్య సయోధ్య కుదరడం కష్టమే. ఇక్కడ కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఉండగా తెలుగుదేశం నుంచి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీ పడనున్నారు. వీరిలో ఎవరో ఒకరు నియోజకవర్గం మారితే తప్ప వివాదం పరిష్కారమయ్యే అవకాశాలు లేవు.
టీడిపి కాంగ్రెస్ మద్య అవగాహన ఉంటేనే పొత్తు ముందుకు వెళ్లే అవకాశం..
మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల,నారాయణపేట నియోజకవర్గాల కోసం టీడీపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేట కూడా ఈ రెండు పార్టీలకు అగ్నిపరీక్షనే. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిని సర్దుబాటు చేయడం రెండు పార్టీలకు సాధ్యమయ్యే పని కాదు. కరీంనగర్ లో జగిత్యాల సీటుపైన కూడా పీఠముడి పడటం ఖాయం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సొంత నియోజకవర్గం కూడా ఇదే కావడం విశేషం. రమణ పోటీకి దూరంగా ఉంటే తప్ప జగిత్యాల పంచాయతీ తేలడం అంత సులువు కాదు. హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం సీనియర్ నేత ఇనగాల పెద్దిరెడ్డి భావిస్తున్నారు.
ఈ సీటుపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు కౌషిక్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు కన్నేశారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, పాలేరు, భద్రాచలం, కొత్తగూడెం తో పాటు ఒకటి రెండు సీట్లను టీడీపీ డిమాండ్ చేయనున్నది. ఇక్కడ కనీసం మూడు సీట్లను ఆ పార్టీకి కాంగ్రెస్ వదలాల్సి ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ల్లో ఒక్కొక్కొ సీటను టీడీపీ ఆశించే అవకాశాలున్నాయి.వీటిని సర్దుబాటు చేయడం కాంగ్రెస్ కు కష్టమనే చెప్పాలి.
గెలంవాలంటే త్యాగం చేయాల్సిందే..
మరో వైపు మహాకూటమిలో సీపీఐ కూడా భాగస్వామిగా ఉండనుంది. కనీసం పది సీట్లను ఆ పార్టీ కోరుకోవడం ఖాయం. నల్గొండ జిల్లాలోని దేవరకొండ ఆ పార్టీ సిట్టింగ్ సీటు. మునుగోడు నియోజకవర్గాన్ని కూడా సీపీఐ డిమాండ్ చేయనున్నది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ కు బలమైన నాయకులే ఉండటం విశేషం. మునుగోడు నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఖమ్మం, వైరా, అశ్వారావుపేట సీట్లను కూడా సిపిఐ అడిగే అవకాశముంది. ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితో పాటు మరో సీటుపైన కమ్యూనిస్టు పార్టీ కన్నేయనున్నది. ఇక కొత్త పార్టీ తెలంగాణ జనసమితి కనీసం ఇరవై సీట్లు కావాలని పట్టు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి పోటీ చేయాలని కోదండరాం భావిస్తున్నారు. వరంగల్ , మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలను ఆ పార్టీ కోరుకునే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల నాటికి బలమైన నాయకులు చేరితే వారి కోసం సీట్లను కోదండరాం అడగనున్నారు. మహాకూటమిలో న్యూ డెమోక్రసీ చేరితో ఆ పార్టికి ఇల్లెందు సీటును కేటాయించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్ సీటు డిమాండ్ చేయనున్నది. ఈ సీటును కాంగ్రెస్ వదిలేసే అవకాశమే లేదు. ఒక వేళ సిపిఎం మహాకూటమిలో చేరితో పొత్తులు మరింత గందరగోళానికి దారి తీయడం ఖాయం. ఇబ్రహీం పట్నం, మిర్యాలగూడా, నల్గొండ, భద్రాచలం, ఖమ్మం, పాలేరు, మధిర, వరంగల్ తో పాటు మరో పది సీట్లను ఆ పార్టీ కోరుకునే అవకాశాలున్నాయి.
అందరూ ఏకమైతే విజయం తద్యం అంటున్న నాయకులు..
లోక్ సభ సీట్ల విషయంలో కూడా మహాకూటమి అగ్ని పరీక్ష ఎదుర్కొనున్నది. తెలుగుదేశం కనీసం రెండు సీట్లను డిమాండ్ చేయనున్నది. ఖమ్మంతో పాటు చేవేళ్ల ,మహబూబ్ నగర్ స్థానాలను ఆ పార్టీ కోరుకోనున్నది. సీపీఐ నల్గొండ లేదా ఖమ్మం కావాలనే ఛాన్స్ ఉంది. తెలంగాణ జనసమితి వరంగల్, కరీంనగర్ స్థానాలపైన గురిపెట్టే అవకాశముంది. మొత్తానికి మహాకూటమి ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదు. కాని పొత్తులు మాత్రం అంత సులభంగా కాదు. పార్టీలు సీట్లను సక్రమంగా పంచుకోవడానికి పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ఇక మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు లేకుండా చూడటం ఆయా పార్టీల నాయకులకు కత్తి మీద సాము కానున్నది.
గతంలో ఏర్పాటైన మహాకూటమి ఈ విషయంలోనే దెబ్బతిన్నది. టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు సరిగా కుదరకపోవడంతో మహాకూటమి వైఫల్యాన్ని మూటకట్టుకుంది. మరి కాంగ్రెస్ నేత్రుత్వంలోని తెలంగాణ మహాకూటమి ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.