ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేనట్టేనా : కేసీఆర్ కు గ్రేట్ రిలీఫ్: వాట్ నెక్ట్స్..!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నా..ప్రతీ రౌండ్ లోనూ కారు జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉప ఎన్నిక మీద ఉంటుందని.. అధికార పార్టీకి షాక్ తప్పదని అంచనాలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాలు అన్నీ ఒకవైపు.. అధికార పార్టీ మరో వైపు అన్నట్లుగా పరిస్థితి మారింది .ఆర్టీసీ సమ్మెకు ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం మీద ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించలేదు.
ప్రతీ రౌండ్ లోనూ సైదిరెడ్డి ఆధిపత్యం స్పష్టంగా కనిపించంది. దీని ద్వారా ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వాదననే ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారా..లేక కేసీఆర్ మీదనే నమ్మకం ఉంచారా.. ఉప ఎన్నిక కాబట్టి అధికార పార్టీకే పట్టం కట్టారా..ఇవన్నీ కాకుండా సైదిరెడ్డి పైన వ్యక్తిగతంగా అభిమానం చూపించి గెలిపించారా అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది గ్రేట్ రిలీఫ్. ఇక, ఇప్పుడు జరగబోయేది ఏంటి..
హుజూర్ నగర్ లో ఆ నిర్ణయమే కాంగ్రెస్ ను ముంచిందా: బాధ్యులెవరు: కారుకు కలిసొచ్చిందవే..!
ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించలేదు..
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ద్వారా అధికార పార్టీ ఖచ్చితంగా దిగి వస్తుందనే అంచనాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు కనిపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా దాదాపు అన్ని పార్టీలు..ప్రజా..ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలవటంతో అక్కడి ఓటర్లు సైతం అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలుస్తారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆశించారు. కానీ, ఓటర్లు మాత్రం సమ్మెను..ఎన్నికలను విడివిడిగానే భావించారు.
సమ్మె విషయంలో కార్మికులకు మద్దతుగా నిలిచినా.. ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీని గెలిపించాలని నిర్ణయించారు. దీంతో..ఓటర్లు అందరూ ఏకపక్షంగా అధికార పార్టీకి మద్దతుగా నిలిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పైన కనిపించిన ప్రతికూల పరిస్థితులు ఎన్నికల్లో మాత్రం ప్రభావితం చేయలేదు. ఇది..ఒక రకంగా ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ నేతలను సైతం ఆలోచనలో పడేసే అంశం.
కేసీఆర్ కు గ్రేట్ రిలీఫ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆర్టీసీ సమ్మె మొదలైన నాటి నుండి ప్రతకూలత కనిపించింది. ప్రధానంగా కార్మిక..ఉద్యోగ..ఉపాధ్యాయ జేఏసీ నేతలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించారు. ఉద్యోగులకు ఇప్పటి వరకు ఐఆర్ సైతం ఇవ్వకపోవటం..ఆర్టీసీ సమ్మె పైన కఠినంగా వ్యవహరించటం..ముఖ్యమంత్రి హుజూర్ నగర్ లో ప్రచారానికి వెళ్లలేక పోవటం వంటి వాటి ద్వారా ప్రతిపక్ష నేతలు తమదే పై చేయి అవుతుందని భావించారు. కానీ, రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రగతి భవన్ నుండే కేడర్ కు దిశా నిర్ధేశం చేసారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక ఫలితం తమకు వ్యతిరేకంగా వస్తే..ఎదురయ్యే పరిణామాలు కేసీఆర్ కు బాగా తెలుసు. దీంతె..ఆయన ఆ అవకాశం ఇవ్వదలచుకోలేదు. అన్ని అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. ఇప్పుడు ఏకపక్షంగా వస్తున్న అంచనాలు.. దాదాపు ఫలితం సైతం తేలిపోవటంతో ఇప్పుడు ఇది ముఖ్యమంత్రికి గ్రేట్ రిలీఫ్ గా కనిపిస్తోంది.
ఇప్పుడు జరగబోయేదేంటి..
ఇక, ప్రజల మద్దతు తమ వైపే ఉందని అధికార పార్టీ చెప్పుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఇక, ఇప్పటి వరకు మొండిగా వ్యవహరించిన ముఖ్యమంత్రి..చివరి నిమిషంలో ఆర్టీసీ ఈడీలతో కమిటీ వేసి కొంత మెత్త బడినట్లుగా కనిపించటం సైతం వ్యూహాత్మక ఎత్తుగడే. జేఏసీ నేతలు కొందరు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సీఎం ఆగ్రహాన్ని తెప్పించాయి.
దీంతో..ఇప్పుడు ఆర్టీసీ విషయానికి సీఎం మరింత వేగంగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. తనకు ప్రజల నుండి వచ్చిన మద్దతుతో..మరింత స్పూర్తితో ముందడుగు వేసి..సమస్యను అధికారుల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి తాను కార్మికులకు వ్యతిరేకం కాదని సంకేతాలు ఇచ్చి..ఒకే ఫలితంతో మొత్తం పరిస్థితిని కేసీఆర్ తన నియంత్రణలోకి తెచ్చుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలో గెలిచనంత మాత్రాన కేసీఆర్ ఇక మొండిగా వ్యవహరించే పరిస్థితి లేదని అంచనా. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ సైతం ఒక మెట్టుదిగే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.