ఏ క్షణంలోనైనా గ్రేటర్ పోరు: జిహెచ్ఎంసి చట్టంలో కీలక మార్పులు, 'రియల్' నిర్ణయాలు కూడా
హైదరాబాద్: ఈ నెలాఖరులోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీ యాక్ట్ 1955కు కొన్ని మార్పులు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో పూర్తయ్యేలా మార్లుపు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు నాలుగు రోజుల గడువును కేటాయించింది. నామినేషన్ల పరిశీలనకు ఒక రోజు, ఉపసంహరణకు ఒక రోజు గడువు కేటాయించింది.
ప్రచారానికి ఏడు రోజుల గడువు కేటాయించింది. మొత్తం నోటిఫికేషన్ జారీ నుంచి పోలింగ్ వరకు 15 రోజుల గడువు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల గడువును 3 రోజులకు కుదించింది. నామినేషన్ల ఉపసంహరణ నుంచి 9 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా పొందుపర్చింది.
జిహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సిద్ధమయిందని చెప్పవచ్చు. ఏ క్షణంలోనైనా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశముంది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ పైన సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. నోటిఫికేషన్కు ముందే పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
'రియల్' రంగానికి ఊతం
తెలంగాణ రాష్ట్రంలో బిల్డరుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) చేసిన విజ్ఞప్తి మేరకు పలు రాయితీలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది.
వారి విజ్ఞప్తి మేరకు పలు మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సమావేశంలో చర్చించిన 23 నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా త్వరితగతిన అనుమతుల కోసం ఆన్లైన్లో అప్రూవల్ సిస్టంను అందుబాటులోకి తెస్తోంది.
ఖాళీగా ఉన్న స్థలాలకు వేంట్ ల్యాండ్ పన్నును మినహాయింపునిస్తోంది. బహుళ అంతస్తుల భవనాల ఎత్తుకు మినహాయింపు ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్లో ఇంపాక్ట్ ఫీజు 50 శాతానికి తగ్గించింది. సైబరాబాద్ డెవలప్మెంట్ పరిధిలో ఫీజులను కూడా తొలగించింది.