టార్గెట్ మేయర్: ఆంధ్రులవల్లే అభివృద్ధి, హైదరాబాద్లో 'సీమాంధ్ర' కొట్లాట
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో అధికార, ప్రతిపక్షాలు గ్రేటర్ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త తాయిలాలతో గ్రేటర్ ఎన్నికల బరిలోకి వస్తున్నాయి.
షెడ్యూల్ విడుదలకు ముందే రాజకీయ వేడి కనిపించింది. ఇప్పుడు ఆ వేడి మరింత రాజుకుంది. అధికార టిఆర్ఎస్ ప్రచారం మొత్తాన్ని మంత్రి కెటిఆర్ భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి వారి పైనే పడింది. సీమాంధ్రులను మచ్చిక చేసుకునేందుకు అధికార తెరాస, ఎక్కడ తమ నుంచి జారిపోతారోనని టిడిపి - బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
సీమాంధ్ర ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అధికార తెరాస తాయిలాలు ప్రకటించింది. తమ ప్రభుత్వానికి సీమాంధ్రులు, తెలంగాణవాళ్లు సమానమేనని చెప్పారు. దానికి కౌంటర్గా టిడిపి నేతలు... డిప్యూటీ మేయర్ పదవి సీమాంధ్రులకు ఇస్తామని తాయిలాలు ప్రకటించారు.
సవాళ్లు
హైదరాబాదులో టీఆర్ఎస్ గెలవకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సంచలన సవాల్ చేశారు. దానికి టిడిపి నుంచి సరికొత్త కౌంటర్ వచ్చింది.
కెటిఆర్ రాజీనామా అవసరం లేదని, తమ పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లిన తలసాని శ్రీనివాస్ వంటి వారిచే రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకుంటే చాలని, ఆ తర్వాత రాజకీయ సన్యాసం చేయాలని కొత్త సవాల్ చేశారు. హైద్రాబాద్ అభివృద్ధి సీమాంధ్రుల వల్లే అయిందని చెప్పారు. వారు ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇక్కడ హైదరాబాదును అభివృద్ధి చేశారన్నారు.
బిజెపి నేతలు మాట్లాడుతూ.. టిడిపి - బిజెపి కూటమిని ఓడించేందుకు టిఆర్ఎస్ కుయుక్తులు, కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మజ్లిస్ అజెండా అమలు చేయడం ఖాయమని ఆరోపిస్తున్నారు.
వారి చుట్టూనే గ్రేటర్..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రధానంగా సీమాంధ్ర ఓటర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే మంత్రి కెటి రామారావు విపక్షాలకు ప్రధాన లక్ష్యంగా మారారు.
ప్రధాని నరేంద్ర మోడీని తెరాస టార్గెట్ చేసుకుంటోంది. అధికారంలోకి వచ్చాక ప్రధాని హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారని తెరాస ప్రశ్నిస్తోంది. ఇక, గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలో ఉంటారో ఉండరో తెలియని పవన్ కళ్యాణ్ పైన తెరాస నేతలు ముందస్తుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.