కెసిఆర్కు 'చెత్త' చిక్కు: షబ్బీర్ అల్టిమేటం, బాబు ద్రోహి: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పైన ప్రభుత్వం స్పందించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిప్పులు చెరిగింది. గ్రేటర్ ఎన్నికల ముందు కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందులు తెచ్చుపెడుతోందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పారని, కెసిఆర్ తన భజనపరులతో హైదరాబాదులో చీపురు పట్టించి ఊడిపించాలన్నారు. బంగారు తెలంగాణ కోసం అన్న డి శ్రీనివాస్ కూడా చీపురు పట్టాలన్నారు.
ప్రభుత్వం స్పందించకుంటే మేమే క్లీన్ చేస్తాం: షబ్బీర్ అలీ
మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం క్లీన్ సిటీని చెత్త సిటీ చేసిందని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యను పరిష్కరించి, స్పందించకుంటే మేమే రంగంలోకి దిగి శుభ్రం చేస్తామని హెచ్చరించారు.
పవిత్ర రంజాన్ సమయంలో మసీదుల వద్ద కంపు కొడుతోందన్నారు. 40వేల మంది కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. నగరంలో పేరుకుపోయిన చెత్తపై గవర్నర్ స్పందంచాలన్నారు.
చంద్రబాబు ద్రోహి: లక్ష్మారెడ్డి
చంద్రబాబు తెలంగాణ, పాలమూరు ద్రోహి అని మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తత పేరుతో పాలమూరు జిల్లాను ఇన్నాళ్లు అణిచివేశాడన్నారు. పాలమూరు వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి భారీ రుణాలు పొంది సీమాంధ్రలో ఖర్చు పెట్టాడన్నారు.
చంద్రబాబు తీరును ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకుంటే బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.
అంతకుముందు, జూపల్లి మాట్లాడుతూ.. రావుల చంద్రశేఖర రావుకు సవాల్ చేశారు. పాలమూరు జిల్లాకు టీడీపీ హయాంలో ఎన్ని నిధులు విడుదల చేశారో తాను చర్చకు సిద్ధమని, రేపు ఉదయం పదిన్నరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వస్తానని, రావుల వస్తారో, పెదబాబు వస్తారో, చినబాబు వస్తారోనని సవాల్ చేశారు.