గ్రేటర్ వార్: బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న కాంగ్రెస్..అసలేం జరుగుతోంది ?
దుబ్బాక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నేతలను ఆలోచనలో పడేశాయి. వెంటనే వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నేతలను బిజెపి వంక చూసేలా చేస్తున్నాయి . ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది. మరోపక్క బిజెపి, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగి టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారైనా ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటే, పార్టీలో ఉన్న నేతలు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు.
పక్క పార్టీల వంక చూస్తున్న కాంగ్రెస్ నాయకులు .. బీజేపీలో చేరికలు
దుబ్బాక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది అని భావిస్తున్న చాలా మంది నేతలు టికెట్ల కోసం బీజేపీ వంక చూస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. బిజెపి ఆకర్ష్ దెబ్బకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. ఇప్పటికే కొప్పుల నరసింహా రెడ్డి బిజెపిలో చేరగా నేడు ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణ గౌడ్ , మాజీ మేయర్ బండ కార్తీక బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
కాంగ్రెస్ వీక్ అయిందని భావించి బీజేపీ వైపు చూపు
మరోవైపు శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ ఆయనతోపాటు బిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరడానికి రెడీ అవుతున్నారు .ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు . హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేయడం కోసం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు చాలామంది కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే కంటే, బిజెపి నుండి బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ భావిస్తున్నారు.
దుబ్బాక ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన కారణం
ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సమయంలో కూడా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ప్రదర్శన కనబర్చడంతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపి వైపు చూస్తున్నారు. ముందు ముందు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేసి బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన కారణంగా రాజకీయ వర్గాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎవరికి వారు తమ రాజకీయ భవితవ్యం కోసం ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనను చేస్తున్నారు.
Recommended Video
కాంగ్రెస్ పై నేతల్లో విముఖత .. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ కుదేలు
ఈ క్రమంలో దుబ్బాక ఎఫెక్ట్ తో కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ పైన కాస్త విముఖతను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. పార్టీని మరింత బలహీనం చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తుంటే పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు.