పాలన తెలియదన్న వాళ్లే ఫాలో అవుతున్నారు : కేటీఆర్
ఇండస్ట్రీయల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల సూక్ష్మ మరియు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించేందుకు చాలమంది ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్లో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ అభివృద్ది మోడల్
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్దికి చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు పాలన తెలియదని చెప్పారని కాని , ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విధానాలను ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్నాయని చెప్పారు. గర్వంగా మాది తెలంగాణ చెప్పుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇందులో భాగంగానే పరిశ్రమలను పర్యావరణ రహితంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పర్యావరణరహిత పరిశ్రమల ఏర్పాటు వల్ల యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.
అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం
ఇక పారిశ్రామిక రంగానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల కరెంటును అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఈ విధానం భవిష్యత్లో దేశానికి అదర్శం అవుతుందని అన్నారు. ఇక ఎమ్మెఎస్ఎమ్ఈలకు రాష్ట్రప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. అయితే చిన్నతరహా పరిశ్రమలకు బ్యాంకులు సరైన సహాకారం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారంటీ లేకుండా బ్యాంకులు కోటి రూపాయల నుండి మూడు కోట్ల రూపాయల వరకు రుణాన్ని ఇవ్వవచ్చనే నిబంధనను, కేంద్రం చెప్పిన అమలు జరపడం లేదని చెప్పారు.
నల్గొండకు డ్రైపోర్టు
ఇక ప్రస్తుతం ప్రారంభించిన గ్రీన్ఇండస్ట్రీయల్ పార్కును ప్రస్తుతం 435 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, అయితే మరింత స్థలం కావాలని పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారని చెప్పారు. ఈ పార్కును 2000 ఎకరాల వరకు విస్తారిస్తామని చెప్పారు. భూ సేకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ప్రారంభించామని ,ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గోండ జిల్లాకు డ్రైపోర్టును కూడ తీసుకువస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.