2 వేల ఎకరాలకు విస్తరణ.. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
పర్యావరణహితంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 70 శాతానికిపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) సంస్థేనని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నల్గొండ జిల్లా దండుమల్కాపూర్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
సకల వసతులతో..
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్కులను వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు డ్రై పోర్టు వస్తుందని హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో కొత్త విధానం తీసుకొచ్చామని వివరించారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ హరితహారంలో ముందు ఉండాలని కేటీఆర్ కోరారు.
36 వేల మందికి ఉపాధి..
గ్రీన్ పార్క్తో దాదాపు 36 వేల మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. టీఎస్ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను కల్పించామని కేటీఆర్ గుర్తుచేశారు. కొత్త రాష్ట్రంలో రకరకాల దుష్ర్పచారాలు చేశారని.. కానీ వాటిని పాటపంచాలు చేశామని తెలిపారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, గృహలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక విధానంలోనే విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని వెల్లడించారు.
15 రోజుల్లోనే పర్మిషన్
15 రోజుల్లో కంపెనీలకు అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. అనుమతి ఇవ్వడం ఆలస్యమైతే సంబంధిత అధికారి రోజుకు రూ. వెయ్యి చొప్పున ఫైన్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విధానాలను కేంద్రం కూడా అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. గురువారం నాటి సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ పథకాలపై ఆసక్తి కనబరిచినట్టు వెల్లడించారు.
2 వేల ఎకరాలకు విస్తరణ
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 440 ఎకరాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్థలం సరిపోవడం లేదని స్థానిక నేతలు చెప్పారని కేటీఆర్ చెప్పారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 2 వేల ఎకరాలకు విస్తరిస్తామని హామీనిచ్చారు. రైతులకు న్యాయబద్ధంగా ధర ఇచ్చి భూమి తీసుకోవాలని సంబంధిత అధికారులను కేటీఆర్ సభ వేదికనుంచి కోరారు. పరిశ్రమల కోసం పర్యావరణాన్ని ఫణంగా పెట్టలేమని కేటీఆర్ అన్నారు.