ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. గ్రౌండ్ రియాలిటీ... టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు ఎంతమంది..
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ డిజిటల్ క్లాసులు బోధిస్తున్నారు. టీశాట్,దూరదర్శన్ చానెల్స్ ద్వారా బోధిస్తున్న ఈ క్లాసులకు మొదటిరోజు 14,03,714 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటూ 'ది ప్రింట్' ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. మొదటిరోజు దాదాపు 1.38లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్ డిజిటల్ క్లాసులకు హాజరయ్యేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.
ప్రభుత్వ లెక్కలు...
తెలంగాణలో 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం టీశాట్,దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ డిజిటల్ క్లాసులు బోధిస్తోంది. టెలివిజన్ లేదా యూట్యూబ్ ద్వారా విద్యార్థులు ఈ క్లాసులు వినాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 3 నుంచి 10 తరగతుల విద్యార్థులు మొత్తం 16,43,309 మంది ఉండగా... ఇందులో మెజారిటీ విద్యార్థులు సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఆన్లైన్ క్లాసులకు హాజరైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్&డైరెక్టర్ శ్రీ దేవసేన వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 14,03,714(85.4శాతం) మంది విద్యార్థులు మొదటిరోజు ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యారు.మిగిలిన విద్యార్థుల్లో 1,01,595 మంది విద్యార్థులు విద్యుత్ సమస్యలు,ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయారు.
గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందన్న వాదన....
ప్రభుత్వం చెప్తున్న లెక్కలతో కొంతమంది సామాజిక కార్యకర్తలు విబేధిస్తున్నారు. దాదాపు 30శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు దూరంగా ఉన్నట్లు చెప్తున్నారు. బాలల హక్కుల వేదిక ఎన్జీవో బి.వెంకటేశ్ మాట్లాడుతూ... గ్రౌండ్ రియాలిటీ చాలావరకు వేరుగా ఉందన్నారు. ఉదాహరణకు... లింగాల అనే మండలంలో ఆరు గంటల పాటు కరెంట్ పోయిందని... కాబట్టి అక్కడి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే మొదట వారు లాగిన్ అయి ఉంటారు కాబట్టి... ఆ తర్వాత విద్యుత్ సమస్య కారణంగా క్లాసులు వినలేకపోయినా... వారిని కూడా క్లాసులకు హాజరైనట్లే పరిగణిస్తున్నారని చెప్పారు.
టెక్నాలజీ అందుబాటులో లేక...
ఆన్లైన్ డిజిట్ క్లాసులతో తలెత్తుతున్న కొన్ని సమస్యలను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ అంగీకరించారు. అంత సవ్యంగానే ఉందని తాను చెప్పట్లేదని... అయితే మొదటిరోజు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. డిజిటల్ డివైజ్(టెలివిజన్,స్మార్ట్ ఫోన్)లు అందుబాటులో లేని 1.38లక్షల మంది విద్యార్థుల్లో... 78వేల మందికి మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏవిధమైన టెక్నాలజీ అందుబాటులో లేని కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 9980 మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు దూరంగా ఉన్నారు. జిల్లాలోని మొత్తం విద్యార్థుల్లో వీరు 18.57శాతం. ఆ తర్వాతి స్థానంలో మహబూబాబాద్ ఉన్నది. ఆ జిల్లాలో 7వేల మంది విద్యార్థులు ఏవిధమైన టెక్నాలజీ అందుబాటులో లేక ఆన్లైన్ క్లాసులకు దూరంగా ఉన్నారు. జిల్లాలోని మొత్తం విద్యార్థుల్లో వీరు దాదాపు 18శాతం.
Recommended Video
సమస్యలను పరిష్కరించాలన్న విజ్ఞప్తులు...
అమ్రాబాద్ గిరిజన ప్రాంతంలో దాదాపు 150 మంది విద్యార్థులు ఏవిధమైన టెక్నాలజీ అందుబాటులో లేని కారణంగా డిజిటల్ క్లాసులకు దూరంగా ఉన్నారు. అక్కడ ఇంటర్నెట్,సిగ్నల్ కనెక్టివిటీ సమస్యలు,అన్నింటికంటే ముఖ్యంగా టెలివిజన్ లేదా స్మార్ట్ ఫోన్ వంటి డిజిటల్ డివైజ్లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్లు అందుబాటులో లేని కారణంగా విద్యకు దూరమవుతుండటం పేద విద్యార్థులను బాధిస్తోందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.