గుడుంబా మహమ్మారి: 12 మంది బలి, మృతుల సంఖ్య 37
హైదరాబాద్: గుడుంబా దొరకక తాజాగా మంగళవారంనాడు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మరణించారు. దీంతో అలా మరణించినవారి సంఖ్య 37కు చేరుకుంది. కల్తీ మద్యంపై, కల్తీ కల్లుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటి నుంచి ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయి.
కల్తీ కల్లు దొరకక వ్యసనపరులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మగంళవారంనాడు 12 మరణించగా, మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు చనిపోయారు. వారిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
మెదక్ జిల్లాలో నలుగురు మరణించారు. కరీంనగర్ జిల్లాలో ఒకరు మరణించారు. వందలాది మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో 800 మందికిపైగా చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చెప్పారు
నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో పరిస్తితి అత్యంత దారుణంగా ఉంది. 200 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.