జోరుగా గుడుంబా దందా ... దాడులతో ఎక్సైజ్ పోలీసులు బిజీ
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. ఇంకేం గుడుంబా వ్యాపారం జోరందుకుంది. ఎక్కడ చూసినా గ్రామాలలో పెద్ద ఎత్తున గుడుంబా బట్టీలు పెట్టి మరీ గుడుంబా తయారు చేస్తున్నారు. ఇక దీంతో ఎక్సైజ్ అధికారులకు చేతి నిండా పని పడింది.
కరోనా ఎఫెక్ట్ .. ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు ... కిటకిటలాడుతున్న సర్కారీ ఆస్పత్రులు
లాక్ డౌన్ నేపధ్యంలో నిత్యావసరాలు మినహాయించి మరే ఇతర షాపులు తెరవకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు . అయితే మందుబాబులు ఊహించని విధంగా మద్యం షాపులు బంద్ అవ్వడంతో మద్యం ప్రియులు గుడుంబా బాట పట్టారు. కొద్ది రోజులుగా మద్యం అమ్మకాలు నిలిచి పోవడంతో మారుమూల గ్రామాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. దాదాపుగా కనిపించ కుండా పోయిన గుడుంబా తయారీ తెలంగాణా గ్రామాల్లో కరోనా లాక్ డౌన్ పుణ్యమాని మళ్ళీ పునరావృతమవుతోంది. దీనికి తోడు ఇప్పపువ్వు రాలే సమయం ఇదే కావడంతో గ్రామాల్లో విరివిగా ఇప్పపువ్వు సేకరణ జరుగుతోంది. మద్యం దొరక్క ఇబ్బంది పడుతున్న వారి నుండి గుడుంబాకుమంచి డిమాండ్ ఏర్పడడంతో గతంలో తయారు చేసిన వారంతా మళ్లీ అదే వృత్తిని మొదలు పెడుతున్నారు.
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో విధించిన లాక్ డౌన్ అదునుగా తెలంగాణా రాష్ట్రంలోని పలు గ్రామాలలో గుడుంబా గుప్పుమంటుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గుడుంబా జోరుగా తయారుతుంది. ఇక గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేస్తున్న పరిస్థితి.ఇప్పటికే వరంగల్ రూరల్ జిల్లా మేడపల్లి వద్దగల లక్ష్మీ తండాలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి గుడుంబా బట్టీలను ధ్వంసం చేశారు . ఇక తాజాగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వాహన తనిఖీల్లో ఒక ఆటో లో అక్రమంగా తరలిస్తున్న 260 కేజీల నల్లబెల్లం , 5 కేజీల పటిక, 5 లీటర్ల గుడుంబాను పోలీసులు పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా గుప్పుమన్న గుడుంబా మళ్ళీ కరోనా లాక్ డౌన్ కారణంగా మొదలైంది . దీంతో ఎక్సైజ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది .