నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ కూలీ మనిషిలా ఉన్నారు: ఆజాద్, టీడీపీతో పొత్తుపై విజయశాంతి
దరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మహాకూటమి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ ఆజాద్ తదితరులు దుమ్మెత్తి పోస్తున్నారు.
రేవంత్రెడ్డి అరెస్ట్పై హైకోర్టులో పిటిషన్, కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా:జైపాల్
అందుకే టీడీపీతో పొత్తు
కేసీఆర్ లాంటి గజదొంగను గద్దె దించేందుకు తాము (టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి) ఒక్కటయ్యామని విజయశాంతి అన్నారు. కేసీఆర్ను అధికారం నుంచి దింపేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనేది కేసీఆర్ ఆర్భాటమని చెప్పారు. తెలంగాణ ప్రజల నెత్తిటికూడు వారు తింటున్నారని మండిపడ్డారు. నలుగురు కలిసి, నాలుగు కోట్ల మందిని మోసం చేస్తున్నారన్నారు.
అప్పుడు కేసీఆర్ కూలీ మనిషిలా ఉండేవారు
కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని పుణ్యానికి 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం అన్నారు. తాను రాష్ట్ర సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ తమ వద్ద (కాంగ్రెస్) కూలీ మనిషిలా ఉన్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదన కోసమే టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఇందులో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని చెప్పారు.
జనంలోకి రావాలంటే కేసీఆర్కు భయం
మరోసారి తెరాస గెలిస్తే ప్రజల పని అయిపోయినట్లేనని హిందూపురం శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈవీఎంలలో గోల్మాల్ జరగవచ్చునని హెచ్చరించారు. యువత చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ గంటకు ఓ డ్రెస్ మార్చుతారని, కానీ ప్రజల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ సభ పైనుంచి దిగి మాట్లాడరని, ఎందుకంటే జనంలోకి రావాలంటే ఆయనకు భయమని చెప్పారు.
బోగస్ ఓట్లపై ఫిర్యాదు
మరోవైపు, బోగస్ ఓట్లపై మహాకూటమి నేతలు ఈసీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దొడ్డి దారిన మళ్లీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నిస్తోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ఇందులో భాగంగానే ప్రజాకూటమి అభ్యర్థులను అరెస్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందన్నారు. దోపిడీ చేసిన ధనంతో తెలంగాణ ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. పోలీసుల అండతో ప్రజాకూటమి నేతలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. అలాంటి వాటికి తాము భయపడమని, ప్రజల మద్దతుతో ఎన్నికలకు వెళతామన్నారు. 80 నియోజకవర్గాల్లో 40 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని, ఈ విషయంలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.