'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు చరిత్రాత్మకం: కెసిఆర్ ప్రశంసతో గుణశేఖర్ భావోద్వేగం
హైదరాబాద్: కాకతీయ వైభవంపై తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకొన్న నిర్ణయం ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని దర్శక, నిర్మాత గుణశేఖర్ చెప్పారు.
కథానాయిక అనుష్క, సహనిర్మాత గుణ, నైజాంలో చిత్రాన్ని పంపిణీ చేస్తున్న దిల్రాజులతో కలిసి గురువారం ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. అనంతరం చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో గుణశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.
మన సంస్కృతిని చాటిచెప్పే ఓ గొప్ప చిత్రం తీశావని మెచ్చుకొంటూ, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని ముఖ్యమంత్రి అక్కడిక్కడే పన్ను మినహాయింపు ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని భావోద్వేగానికి గురవుతూ చెప్పారు.
రుద్రమదేవికి పన్ను మినహాయింపునివ్వడం కళలపట్ల, చరిత్ర పట్ల సీఎంకు ఉన్న గౌరవాన్ని చాటి చెబుతోందన్నారు. ఆయన సాహితీప్రియుడు కావడంతో కాకతీయ చరిత్రకు సంబంధించిన చాలా విషయాల్ని మాతో పంచుకొన్నారని, కొన్ని శాసనాల గురించి కూడా సిఎం కెసిఆర్ చెప్పారని గుణశేఖర్ తెలిపారు.
గుణశేఖర్ కలిసిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... ఇలాంటి చిత్రాలు మరెన్నో నిర్మించాలన్నారు. చారిత్రక చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, శుక్రవారం ‘రుద్రమదేవి' చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.