కూల్డ్రింక్లో మత్తు కలిపి రేప్ చేశాడు: అతని వలలో 20 మంది యువతులు
తన కూతురు మరణించిన రోజే రెండేళ్ల తర్వాత అనూష తండ్రి గుంటి రాజేష్ను మట్టుబెట్టాడు. రాజేష్ వలలో 20 మంది యువతులు పడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తన కూతురు దయనీయమైన స్థితిలో మరణించిన రెండేళ్ల తర్వాత అదే రోజు ఆ మృతికి కారణమైన గుంటి రాజేష్ను అనూష తండ్రి శ్యామసుందర్ రెడ్డి మట్టుబెట్టాడు. ప్రేమ పేరుతో మహిళల జీవితాలతో రాజేశ్ చెలగాటమాడాడని, అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు జీవితాన్ని నాశనం చేశాడని పోలీసులకు చిక్కిన శ్యామసుందర్ రెడ్డి అన్నాడు.
గతంలో రాజేశ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలియడం వల్లే అనూష ఆత్మహత్య చేసుకుందని, అందుకే ఆ దుర్మార్గుడిని మట్టుబెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. రెండేళ్ల క్రితం అనూష నాగార్జునసాగర్లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.
కాగా, కరుడుగట్టిన నేరస్థుడైన రాజేశ్పై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ల నుంచి ల్యాండ్ సెటిల్మెంట్ల వరకు దందాలు చేసేవాడు. అప్పటి సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అతడిపై పీడీయాక్ట్ చేశారు. గుంటి రాజేశ్ మొత్తం 20 మంది మహిళలను ప్రేమపేరుతో మోసం చేసినట్లు నిర్ధారించారు.
గతనెల 27న అర్ధరాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలోని తుర్కయాంజల్లో గుంటి రాజేశ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అనూష తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, మహ్మద్ కరీమొద్దీన్, కుంచెపు రమణ, పొగరి దయాకర్, చింతల శ్యామ్సుందర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఓ ప్లాట్ వ్యవహారంలో అనూషకు గుంటి రాజేష్తో పరిచయమైంది. ప్లాట్ నీదేనని.. అందుకు సంబంధించిన సంతకాలు పెట్టాలని చెప్పి తన ఇంటికి రాజేశ్ అనూషను పిలిపించుకున్నాడు. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. దాన్నంతా సెల్ఫోన్లో బంధించాడు. తనను పెళ్లిచేసుకోవాలని బెదిరించాడు.
గత్యంతరం లేక అతడిని అనూష పెళ్లి చేసుకుంది. తర్వాత అతడికి రెండు పెళ్లిళ్లయ్యాయనే విషయం అనూషకు తెలిసింది. అప్పటి నుంచి అతడిని కలవడం మానేసింది. దీంతో ఆగ్రహించిన రాజేశ్ ఆమెను కిడ్నాప్ చేశాడు. దీనిపై అనూష తండ్రి శ్యామ్సుందర్రెడ్డి చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
రాజేశ్ బారినుంచి తప్పించుకుని అనూష నాగార్జున సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణంతో శ్యామ్సుందర్రెడ్డి షాక్ తిన్నాడు.రాజేశ్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్ వేసి శ్యామసుందర్ రెడ్డి గుంటి రాజేష్ను హతమార్చాడు.