వామ్మో.. రాస 'మోహన' లీలలు.. గుంటూరు ఫారెస్ట్ అధికారి కేసులో సంచలన నిజాలు
గుంటూరు : మానవరూపంలో దాగి ఉన్న రాక్షసుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతులను వంచిస్తున్న నరరూప రాక్షసుడి అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. అటవీశాఖ అధికారి మోహన్ రావు వికృత చేష్టలపై తీగ లాగితే డొంక కదులుతోంది. ఇన్నాళ్లు బయటకు రాని ఆ మానవమృగం రాసలీలపై.. ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే దర్యాప్తులో పలువురు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. మోహనరావు వికృత చేష్టలను ధైర్యంగా చెబుతున్నట్లు సమాచారం.
జగన్ అలా.. కేసీఆర్ ఇలా.. ప్రతిపక్షంపై చెరో దారి..!
మోహన లీలలు.. ఉద్యోగాల పేరిట నయవంచన
గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన అటవీశాఖ అధికారి మోహన్ రావు లీలలు విస్మయం కలిగిస్తున్నాయి. ఉద్యోగం, పలుకుబడి అడ్డుపెట్టుకుని యువతులను వంచించడమే లక్ష్యంగా వికృత చేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకోవడమే గాకుండా.. సందర్భాన్ని బట్టి తనలోని కామాంధుడిని బయటకు రప్పించేవాడనే ఆరోపణలు వచ్చాయి. ఇదివరకు చాలామందిని ఛీట్ చేసిన అతడు.. ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాస 'మోహన' లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
అవకాశాన్ని ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులు
ఫారెస్ట్ డిపార్టుమెంటులో కాంట్రాక్టు పోస్టుల పేరుతో వల వేసిన మోహన్ రావు.. యువతులను వంచించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అటవీశాఖ అధికారిగా తన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని నయవంచకుడిగా మారినట్లు తెలుస్తోంది. సదరు మాయగాడి పంజాకు చాలామంది బలైనా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఇన్నాళ్లు నరరూప రాక్షసుడిగా రెచ్చిపోయాడు. చివరకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ బాధితురాలు మోహన్ రావు బాగోతం బయటపెట్టారు.
ఫార్మసీ కోర్సులో డిప్లొమో చదివిన సదరు బాధితురాలు భర్తతో విడిపోయి ఎనిమిదేళ్ల కూతురితో పుట్టింట్లో ఉంటోంది. ఆ క్రమంలో ఫిబ్రవరి నెలలో గుంటూరులోని ఫారెస్ట్ డిపార్టుమెంటులో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉందని తెలియడంతో మోహన్ రావును కలిశారు. అయితే 4 లక్షల రూపాయలు లంచం ఇవ్వాల్సి ఉంటుందని షరతు పెట్టి.. చివరకు బేరసారాలు సాగించి 2 లక్షలకు ఒప్పుకున్నాడు.
లంచానికి లంచం.. ఆపై రాసలీలలు
మోహన్ రావు అడిగిన 2 లక్షల రూపాయలు ఇచ్చాక అసలు విషయం బయటపెట్టాడు. డబ్బులు పెడితే ఉద్యోగాలు రావని.. కాసింత త్యాగం చేయాలని మనసులోని మాట బయటపెట్టాడు. అలా బెదిరిస్తూ చివరకు లొంగదీసుకుని ఐదు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధించాడు. లైంగిక వాంఛలు తీర్చుకుంటూ.. ఉద్యోగం మాట ఎత్తేసరికి కాలాయాపన చేస్తూ వచ్చాడు. చివరకు బాధితురాలు నిలదీయగా ఉద్యోగం లేదు, డబ్బు వాపసు ఇచ్చేది లేదూ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దాంతో ఆమె మోసపోయానని గ్రహించి ఇద్వా నాయకులను కలిశారు.
హోం మంత్రిని కలిసిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు
ఆ క్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరితను కలిసి ఫిర్యాదు చేయడంతో ఆమె సీరియస్గా తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హోం మంత్రి సూచనల మేరకు బుధవారం నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితురాలు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మేడికొండూరు సీఐ ఆనందరావును ఎస్పీ ఆదేశించారు. దాంతో మోహన్ రావుపై కేసు నమోదు చేసి ఆ మేరకు మోహన్ రావు పనిచేస్తున్న కార్యాలయంలో ఉద్యోగులను, సిబ్బందిని విచారించారు.
రాస 'మోహన' లీలలు ఎన్నెన్నో.. చాలామంది బలి
పోలీసుల దర్యాప్తులో రాస 'మోహన' లీలలు మరిన్ని బయటపడ్డాయి. అతడి ఆఫీసులో పనిచేస్తున్న ఓ యువతిని బలవంతంగా లొంగదీసుకున్నాడనే విషయం వెలుగుచూసింది. సెలవురోజుల్లో ఆమెపై మోహన్ రావు వికృత చేష్టలకు పాల్పడినట్లు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది. అలాగే గుంటూరుకు చెందిన మరో యువతి ఉద్యోగం కోసం వెళితే 4 లక్షల రూపాయలు లంచం తీసుకోవడమే గాకుండా లైంగికంగా వేధించి లోబర్చుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే కాలాయాపన చేస్తుండటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని.. లేదంటే రోడ్డెక్కుతానని హెచ్చరించడంతో దశలవారీగా మూడున్నర లక్షలు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది.
మాచర్లకు చెందిన రిక్షా కార్మికుడి కూతురును సైతం ఇలాగే లైంగిక వేధింపులకు గురిచేసి అత్యాచారం చేసే ప్రయత్నంలో ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె తండ్రిని బెదిరించి కంప్లైంట్ వాపసు తీసుకునేలా చేసినట్లు సమాచారం. గతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే దృష్టిలో ఉండటంతో ఆయన కూడా మోహన్ రావు లీలల్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అదలావుంటే మోహన్ రావును తక్షణమే బదిలీ చేయాలని.. శాఖాపరమైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అటవీ దళాల అధిపతి రిజ్వీని ఆదేశించారు మంత్రి బాలినేని.
జగన్, కేసీఆర్ వద్దు.. స్వామిజీలే బెటర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇదో ట్రెండ్..!