టిఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోంది: గుత్తా, ‘గుండు సుధారాణి సభ్యత్వాన్ని రద్దు చేయండి’
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1110 ఓట్లు ఉండగా.. అందులో కాంగ్రెస్కు 552 ఓట్లు ఉన్నాయన్నారు. అయితే కేవలం 138 ఓట్లు ఉన్న టిఆర్ఎస్ ఎన్నికల్లో అనైతికంగా పోటీ చేస్తోందన్నారు.
ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, కౌన్సిలర్లను తీవ్రమైన ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.
గుండు సుధారాణి సభ్యత్వాన్ని రద్దు చేయండి
రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పార్టీ ఫిరాయింపు అంశాన్ని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన సుధారాణి పార్టీ ఫిరాయించారని, అందువల్ల ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ ఛైర్మన్కు కేంద్రమంత్రి, టిడిపి ఎంపీ సుజనాచౌదరి విజ్ఞప్తి చేశారు.
అందుకే మోడీపై కేటీఆర్ విమర్శలు: లక్ష్మణ్
మజ్లిస్ మెప్పు కోసమే ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని బిజెపి శాసనసభా పక్షనేత లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి తెలంగాణపై ప్రేమలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్పై లక్ష్మణ్ మండిపడ్డారు.
టిఆర్ఎస్ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని ఆయన అన్నారు. బీసీ క్రిమిలేయర్పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, బీసీలకు కల్యాణలక్ష్మి ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారు. నగరంలో ఏర్పాటు చేసిన రంగురంగుల హోర్డింగులతో ఒరిగేదేమీ లేదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.