మనసు గెలుచుకున్నావ్: పొన్నంకు గుత్తా సన్మానం
నల్గొండ: కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ను నల్గొండ జిల్లా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం సూర్యాపేటలో సన్మానించారు. ప్రజల కోసం ప్రజల తరపున పోరాడిన వ్యక్తిగా పొన్నం ప్రజల మనసులో నిలిచి పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
కాగా, పొన్నం ప్రభాకర్ ఉదయం సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ముడుపులు తీసుకున్నారని పొన్నం విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై జగదీశ్వర్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం పొన్నం గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు.
వరంగల్ జిల్లాలో టీడీపీ నేతల పర్యటన
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
ఐదు జిల్లాలకు తెరాస అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక
ఐదు జిల్లాలకు తెరాస అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మిగిలిన జిల్లాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి. కొత్తగా పార్టీలో చేరిన వారు, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడంలో మంత్రులు విజయం సాధించారు.
తొలివిడతగా కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాను పార్టీపరంగా రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో ఐదు జిల్లాలకు ఆరుగురు అధ్యక్షులు ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షునిగా బుడాన్ షేక్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ రెడ్డి, నల్లగొండ అధ్యక్షునిగా నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నాగేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా అధ్యక్షునిగా భూమారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా తూర్పు అధ్యక్షునిగా పురాణం సతీష్ ఎన్నికయ్యారు.