కేసీఆర్ అనుకుంటే కేటీఆర్ సీఎం... మండలి ఛైర్మన్ గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు...
కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అన్న ప్రచారంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనుకుంటే కేటీఆర్ను సీఎం చేస్తారని అన్నారు. కేటీఆర్ సమర్థుడని,ఏ పదవినైనా చేపగట్టలరని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను కూడా కేసీఆర్ విస్మరించరని,వారికి అన్యాయం చేయబోరని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. సోమవారం(అగస్టు 31) మండలిలోని తన చాంబర్లో గుత్తా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
Recommended Video
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని... ప్రస్తుతం తనకిచ్చిన పదవిలో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా నీళ్లను మళ్లించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. దానిపై ప్రభుత్వం కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తుందన్నారు.
నల్గొండ జిల్లా పిలాయిపల్లి కెనాల్ వద్ద మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి గన్తో హల్చల్ చేయడంపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కెనాల్ కాలువ కింద మోహన్ రెడ్డికి చెందిన 17 గుంటల భూమి పోతుందని... దాని విషయమై గొడవ జరగడంతో తుపాకీ బయటకు తీశారని అన్నారు. ఆ వీడియో బయటకు రావడంతో చిన్న విషయం పెద్దగా మారిందన్నారు. మోహన్ రెడ్డితో పాటు నర్సింహరెడ్డి అనే మరో వ్యక్తి భూమి కూడా కెనాల్ కాలువ కింద పోతుందన్నారు.
కాగా,కేసీఆర్ అనుకుంటే కేటీఆర్ను సీఎం చేస్తారన్న గుత్తా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ కేబినెట్ తరహా మీటింగ్ నిర్వహించినప్పటి నుంచి... ఇక రేపో మాపో ఆయనే సీఎం అన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే దాదాపుగా పాలనా వ్యవహారాలన్నింటిలోనూ కేటీఆర్ యాక్టివ్గా ఉన్నారు. కేబినెట్ తరహా సమావేశం ఆయన సీఎం పదవిని చేపట్టడానికి ముందు రిహార్సల్ లాంటిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి కేటీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయబోతున్నారన్న ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆయన పట్టాభిషేకానికి ముహూర్తం ఎప్పుడన్నది వేచి చూడాల్సిందే.