కంచర్ల ఎఫెక్ట్: గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి, కారణమదేనా?
కంచర్ల భూపాల్రెడ్డి టిఆర్ఎస్లో చేరడంతో పాటు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను ఆయనకే కట్టబెట్టడంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
నల్గొండ: కంచర్ల భూపాల్రెడ్డి టిఆర్ఎస్లో చేరడంతో పాటు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను ఆయనకే కట్టబెట్టడంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఇంచార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డిని కాదని కంచర్ల భూపాల్రెడ్డిని ఇంచార్జీగా ప్రకటించడం సుఖేందర్రెడ్డికి నచ్చడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కెసిఆర్ పోటీ చేసినా గెలుపు నాదే, రాజకీయాల నుండి తప్పుకొంటా: కోమటిరెడ్డి సంచలనం
నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. రేవంత్రెడ్డితో పాటు కంచర్ల భూపాల్రెడ్డి కూడ టిడిపిని వీడారు. అయితే నల్గొండ అసెంబ్లీ టిక్కెట్టు విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ రాకపోవడంతో కంచర్ల భూపాల్రెడ్డి టిఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తొలిసారిగా ఒకే వేదికపై డికె అరుణ, రేవంత్: కెసిఆర్పై యుద్దానికి సై
మరోవైపు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు గాను టిఆర్ఎస్ బలమైన అభ్యర్థిని అన్వేషిస్తోంది. ఇదే సమయంలో కంచర్ల భూపాల్రెడ్డి టిఆర్ఎస్కు కలిసివచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సన్నిహితులు కూడ రేవంత్కు షాక్: టిక్కెట్ల చిక్కులు, కారణమదేనా
కంచర్లకు పదవిపై గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి
కంచర్ల భూపాల్రెడ్డిని టిఆర్ఎస్లో చేర్చుకోవడంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కంచర్ల సోదరులు మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. ఈ సభకు ముందుగానే హైద్రాబాద్లో సిఎం క్యాంప్ కార్యాలయంలో కంచర్ల సోదరులు ముఖ్యమంత్రి కెసిఆర్తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే కెసిఆర్ కంచర్ల సోదరులకు పార్టీలో గౌరవం కల్పిస్తామని హమీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.ఈ హమీ మేరకే కంచర్ల భూపాల్రెడ్డికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఇప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టనున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఈ పరిణామం పట్ల సుఖేందర్రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం టిఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
సుఖేందర్రెడ్డితో కంచర్ల విభేదించారు
2009 ఎన్నికల సమయంలో నల్గొండ ఎంపీ టిక్కెట్టు విషయమై టిడిపి నాయకత్వం నుండి స్పష్టమైన హమీ లభించలేదు. దీంతో గుత్తా సుఖేందర్రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో సుఖేందర్రెడ్డితో పాటు కంచర్ల భూపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాలుగైదు రోజులకే కంచర్ల భూపాల్రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. ఆ సమయంలో సుఖేందర్రెడ్డిని కాదని కంచర్ల భూపాల్రెడ్డి తిరిగి టిడిపిలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కంచర్ల భూపాల్రెడ్డిని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీగా ఆ పార్టీ ప్రకటించింది.రేవంత్రెడ్డి ఎపిసోడ్ వరకు కంచర్ల భూపాల్రెడ్డి టిడిపిలోనే కొనసాగుతున్నారు. అయితే సుఖేందర్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు వ్యతిరేకంగా కంచర్ల భూపాల్రెడ్డి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎదిగారు.
కంచర్ల భూపాల్రెడ్డిపై సుఖేందర్రెడ్డి ఇలా
సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కంచర్ల భూపాల్రెడ్డి టిడిపిలో కొనసాగడంతో రాజకీయంగా తనను ఇబ్బందిపెట్టేందుకు సుఖేందర్రెడ్డి ప్రయత్నించారని ఆ సమయంలో కంచర్ల భూపాల్రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సుఖేందర్రెడ్డిలు కలిసి ఆర్థికంగా తమ కుటుంబాన్ని నష్టపర్చేందుకు ప్రయత్నించారని కూడ కంచర్ల కుటుంబం ఆ సమయంలో ఆరోపణలు చేసింది. అయితే రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో కంచర్ల భూపాల్రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది. ఈ పరిణామాలు మాత్రం సుఖేందర్రెడ్డికి నచ్చడం లేదనే ప్రచారం మాత్రం సాగుతోంది.
రైతు సమన్వయ సమితి పదవిపై ఇంకా తేల్చని సీఎం
నల్గొండ ఎంపీ సుఖేందర్రెడ్డి కెసిఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాటం చేశారు. రేవంత్రెడ్డితో పాటు సుఖేందర్రెడ్డి కూడ అదే తరహలో పోరాటం చేశారు. అయితే కారణాలేమిటో కాని, సుఖేందర్రెడ్డి సోదరుడు నార్ముల్ ఛైర్మెన్ జితేందర్రెడ్డి టిఆర్ఎస్లో చేరారు.ఈ పరిణామంపై కూడ సుఖేందర్రెడ్డి కెసిఆర్ తీరుపై మండిపడ్డారు. రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో సుఖేందర్రెడ్డి కూడ టిఆర్ఎస్లో చేరారు. సుఖేందర్రెడ్డికి మంత్రిపదవిని ఇస్తారనే ప్రచారం ఆ సమయంలో సాగింది. అయితే క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి సుఖేందర్రెడ్డికి పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయమై తేలలేదు.ఇది కూడ సుఖేందర్రెడ్డి అసంతృప్తికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
దుబ్బాకను ఇంఛార్జీ నుండి తప్పించడంపై సుఖేందర్ అసంతృప్తి
దుబ్బాక నర్సింహ్మరెడ్డి సుఖేందర్రెడ్డికి సమీప బంధువు. అతనిని కాదని కంచర్ల భూపాల్రెడ్డికి టిఆర్ఎస్ నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీ పదవిని కట్టబెట్టడంపై సుఖేందర్రెడ్డి అసంతృప్తిలో తీవ్రమైందనే అభిప్రాయాలు లేకపోలేదంటున్నారు ఆయన వర్గీయులు . ఈ పరిణామాలతో సుఖేందర్రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే రానున్న రోజుల్లో ఏ రకమైన పరిణామాలు చోటుచేసుకొంటాయో చూడాలి.