బాబును లాగి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, విజయశాంతి మాటేమిటని జానాకు ప్రశ్న
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు జీ వివేక్, ఆయన సోదరుడు వినోద్, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడ నర్సింగరావు తదితరులు బుధవారం కారు ఎక్కారు.
తెరాసలోకి వెళ్తున్నాం, సోనియాని మరవం: గుత్తా, వివేక్, ఏడ్చిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో వారు ఈ రోజు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పాతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో కుట్రలు ప్రారంభమయ్యాయి
తెలంగాణ రావాలని ఎంతగానో పోరాడామని, ఎన్నో ధర్నాలు, బంద్లు తర్వాత, ఎన్నో ఆటంకాలు ఎదురైన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. మళ్లీ ఢిల్లీలో కుట్రలు మొదలయ్యాయని, రాష్ట్రపతి పాలన పెట్టించాలనే కుట్ర జరుగుతోందన్నారు.
తెలంగాణ ప్రజలు తెలివిగా ఉండాలన్నారు. తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడిందని, మళ్లీ మన పాలనను చేజార్చుకోవద్దన్నారు. ప్రస్తుతం తెలంగాణలో చరిత్రలో ఎవరూ ఊహించని అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణకు రక్షణ కవచం తెరాస మాత్రమేనని వ్యాఖ్యానించారు. రాజకీయ సుస్థిరత కోసం పార్టీలకతీతంగా నేతలు తమ వెంట వస్తున్నారన్నారు. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ను ప్రజలు గెలిపిస్తున్నారన్నారు.
అన్ని విధాలా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నారు. రాజకీయ, ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించి ఆకుపచ్చ తెలంగాణను తయారు చేయడమే లక్ష్యమన్నారు. సమైక్యవాదుల కుట్రలకు తెలంగాణ బలికావొద్దన్నారు. అన్ని విధాలా తెలంగాణ అభివృద్ధి చెందాలని, తెరాసకు ప్రజలే బాసులు అన్నారు.
రాష్ట్రం సుస్థిరమవుతుందని, కాంగ్రెస్ భ్రష్టు పడుతుందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో కలుపుకున్నప్పుడు జానారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. విజయశాంతి, అరవింద రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడం ఏం నీతి అన్నారు. మీరు చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు.
అచ్చంపేటలో విపక్షాలన్నీ కలిసి పోటీ చేశాయని, అది ఏం నీతి అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారని, రాష్ట్రంలో సుపరిపాలన జరగడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడవద్దు.. ఏర్పడితే బతకనీయవద్దు అని కుట్రలు జరిగాయన్నారు.
తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరిగాయన్నారు. టిడిపి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్ర చేశాయన్నారు. రెండు జర్మనీలు ఏకమైనట్లు తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయని చంద్రబాబు అన్నారని చెప్పారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి 63 స్థానాలు గెలిచిందని, మళ్లీ ఆంధ్రా, తెలంగాణను ఏకం చేస్తామని చంద్రబాబు మాట్లాడాడని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసి, రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్రలు చేసారన్నారు. ఆ సమయంలో మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్కు మద్దతిచ్చిందని, దేశం ముందు తెలంగాణ గెలిచి నిలవాలని, తెలంగాణకు రాజకీయ సుస్థిరత చాలా అవసరమన్నారు.
90కి పెరిగిన తెరాస బలం
తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు విపక్ష ఎమ్మెల్యేలు, నేతలు తెరాసలో చేరుతున్నారు. టిడిపి, వైసిపి, కాంగ్రెస్, బీఎస్పీ ఎమ్మెల్యేలు కారు ఎక్కుతున్నారు. వీరి చేరికతో తెరాస క్రమంగా బలపడుతోంది. మరోవైపు విపక్షాలు బలహీనపడుతున్నాయి.
2014లో గెలిచిన బీఎస్పీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. టిడిపి నుంచి 15 మంది గెలిస్తే 12 మంది చేరారు. కాంగ్రెస్ పార్టీ బలం 13కు పడిపోయింది. మరొకరు లేదా ఇద్దరు చేరితో ప్రతిపక్ష హోదా పోనుంది. సిపిఐ ఎమ్మెల్యే కూడా చేరడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ నేతలు పార్టీ వీడుతుండటంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.