రాజీనామా చేస్తా.. దమ్ముంటే తలపడొచ్చు.. : దిగ్విజయ్ కి గుత్తా సవాల్
హైదరాబాద్ : కాంగ్రెస్ లో ఫిరాయింపు రాజకీయాలు నేతల మధ్య విమర్శలను రగిలిస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఫిరాయింపు రాజకీయం మరింత వేడెక్కుతోంది. కాంగ్రెస్ నుంచి కారెక్కిన నేతలంతా డబ్బులకు అమ్ముడపోయారని దిగ్విజయ్ చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. డిగ్గీ రాజాకు గట్టి కౌంటర్ ఇచ్చారు తాజాగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.
అధికార పార్టీ ఇచ్చే కాంట్రాక్టుల కోసమే పార్టీ కండువా మార్చేశారన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. కాంట్రాక్టుల వ్యవహారం తమ కుటుంబాల్లో తొలి నుంచే లేదని స్పష్టం చేశారు. అయితే తమ వియ్యంకుడు మాత్రం నిజాం కాలం నుంచే కాంట్రాక్టుల రంగంలో ఉన్నారని, ఆ కాంట్రాక్టులకు తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
ఇప్పుడు రాజకీయ నీతి గురించి మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్, యూపీఏపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో టీడీపీ ఎంపీ ఆదికేశవ నాయుడు సహకారం తీసుకున్నప్పుడు రాజకీయ నీతి ఎక్కడికి పోయిందో చెప్పాలని దిగ్విజయ్ ని నిలదీశారు గుత్తా. ఇక రూ.500 కోట్లకు అమ్ముడుపోయారని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు చురకలంటించారు గుత్తా.
పాల్వాయి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని పేర్కొన్న గుత్తా, ఆయన లాగా ఎంపీ నిధులను అమ్ముకునేలా తాను దిగజారలేదని ఎద్దేవా చేశారు. ఇక రాజీనామా చేయకుండానే పార్టీ మారారన్న ఆరోపణలను ప్రస్తావించిన గుత్తా.. సమయం సందర్బాన్ని బట్టి రాజీనామా విషయంపై ఆలోచిస్తానని, రాజీనామా అయితే తప్పదని వ్యాఖ్యానించారు.
నల్గొండ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమని చెప్పిన గుత్తా, దమ్మున్న నేతలెవరైనా తనపై ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలవొచ్చు అని సవాల్ చేశారు. అంతకుముందు గుత్తా పార్టీ మారిన సందర్భంలో పార్టీ ఫిరాయింపులపై మండిపడ్డ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గుత్తా రాజీనామా చేస్తే ఆయనతో తలపడడానికి సిద్దం అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
దీంతో గుత్తా తాజా వ్యాఖ్యలు కూడా కోమటిరెడ్డిని ఉద్దేశించి చేసినవే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీ మారే విషయంలోను కాంగ్రెస్ నేతలందరికీ సమాచారమిచ్చానని చెప్పుకొచ్చిన గుత్తా, ఒక్క కోమటిరెడ్డికి మాత్రం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అసమర్థులకు పీసీసీ పదవులు ఇచ్చారంటలూ ఉత్తమ్ కుమార్ ని విమర్శించిన కోమటిరెడ్డి.. తనను రాజీనామా చేయాలని కోరడం చిత్రంగా ఉందన్నారు.
జానారెడ్డి పట్ల మాత్రం సానుకూలంగానే స్పందించిన గుత్తా, జానారెడ్డికి కుడి భుజంగా పనిచేసి ఇప్పుడు ఆయనకు దూరమవడం బాధించేది గానే ఉందని చెప్పుకొచ్చారు. ఇకపోతే, పార్టీ మారిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుత్తా భాస్కరరావు.. డబ్బులకు అమ్ముడుపోయామని నిరూపిస్తే రాజీనామాకు తాను కూడా సిద్దమేనని స్పష్టం చేశారు. తనకు లైసెన్సే లేదని అలాంటప్పుడు కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.
కాగా, కేసీఆర్ చేస్తోన్న అభివ్రుద్ది పనులను చూసే పార్టీ మారానని ఎంపీ గుత్తా ప్రకటించగా.. యాదాద్రి పవర్ ప్లాంట్, మిర్యాల గూడను నల్గొండలో కలిపే విషయమై కేసీఆర్ స్పష్టమైన హామి ఇచ్చిన మేరకే తాను పార్టీ మారానని ప్రకటించారు ఎమ్మెల్యే గుత్తా భాస్కరరావు.