పటేల్ ప్రధాని అయ్యుంటే భారత్.. మరో పాక్ అయ్యేది: కంచె ఐలయ్య
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ తొలి ప్రధానమంత్రి అయి ఉంటే భారత దేశం మరో పాకిస్తాన్ అయి ఉండేదని ప్రముఖ రచయిత కంచె ఐలయ్య ఆదివారం నాడు వ్యాఖ్యానించారు. మన ప్రజాస్వామ్యం కుప్పకూలేదని అభిప్రాయపడ్డారు.
టైమ్స్ లిట్ ఫెస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. పటేల్ తొలి ప్రధాని అయితే భారత్ మరోలా ఉండేదని ప్రధాని మోడీ అన్నారని కంచె ఐలయ్య అన్నారు.
అతనే తొలి ప్రధాని అయితే భారత్ మరో పాకిస్తాన్ అయ్యేదని వ్యాఖ్యానించారు. అతను డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ను రాజ్యాంగం రాసేందుకు అనుమతించేవాడు కాదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హిందూ మహాసభకు దగ్గరగా ఉండేవాడని, మనుస్మృతిని నమ్మిన వారే రాయాలని ఆయన భావించేవారన్నారు.
కాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పటేల్ భారత దేశ తొలి హోంమంత్రి. దేశంలోని అనేక సంస్థాలను ఏకతాటి పైకి తెచ్చారు. హైదరాబాద్ సంస్థానంను కూడా భారత్లో కలపడంలో పటేల్ పాత్ర ఎంతో ఉంది.