వెల్కం 2018: పార్టీకి సిద్ధమౌతున్నారా జాగ్రత్త! హద్దుమీరితే అంతే, అసభ్య నృత్యాలతో షాక్ తప్పదు
హైదరాబాద్/విశాఖపట్నం: ఓ వైపు నూతన సంవత్సర వేడుకలకు కొందరు దూరం ఉంటుండగా, మరికొందరు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేసేందుకు సిద్ధమయ్యారు. చాలామంది నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ కొత్త సంవత్సరంలో విజయవంతంగా ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు కలగాలని, తెలుగు ప్రజల జీవితాల్లో, దేశ ప్రంజలందరి జీవితాల్లో మంచి మార్పు దారి తీయాలని జగన్ కోరుకున్నారు.
ఇదిలా ఉండగా, నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్, విశాఖ సహా పలు తెలుగు ప్రాంతాల్లో యువత సిద్ధమైంది. కొత్త ఏడాది పేరుతో అతిగా మద్యం తాగి వాహనం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగు రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు.
ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్
కొత్త సంవత్సరం వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవచ్చునని, అయితే 2018కి ఆహ్వానం పలికే పేరుతో మందు పార్టీలు, విందులు, వినోదాలు అంటూ మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపితే ఎవరైనా సరే వదిలేది లేదని, ఇష్టారీతిన తాగి ప్రమాదాలు చేయవద్దని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
సగానికి ఎక్కువ అక్కడే
కొత్త ఏడాది పార్టీలు సగానికి పైగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు, పబ్బులు, బార్లలో న్యూ ఇయర్ పేరుతో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి తీసుకున్నా సామర్థ్యం కన్నా ఎక్కువ పాసులు జారీ చేయడం, వాహనాలను రహదారులపై ఉంచడం చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో గొడవలు జరిగేందుకు అవకాశాలున్నాయన్న అంచనాలతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పాతబస్తీ ప్రాంతాల్లోని బార్లు, పబ్బుల సమీపంలో తాత్కాలిక పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నారు.
మోతాదుకు మించి మద్యం తాగితే
మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపే వారిని హైదరాబాద్ పోలీసులు పట్టుకుని వాహనాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకుంటారు. మారువేషాల్లో వెళ్లి విందులు, వినోదాల్లో పాల్గొనే యువత స్వేచ్ఛకు భంగం కలగకుండానే పోలీసులు మందుబాబుల ఆగడాలపై కన్నేస్తారు. 150 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు.
వేడుకల్లో అసభ్య, అశ్లీల నృత్యాలు ఉంటే
ఎక్కడైనా అసభ్య, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తక్షణమే వేడుకలను నిలిపివేస్తారు. ఇందుకోసం కొంతమంది పోలీసులను ప్రత్యేకంగా కేటాయించారు. సంబరాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కనిపించేలా సీసీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. బాణాసంచా ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో కూడా, తాగి నడిపితే షాక్
విశాఖలో ఆదివారం సాయంత్రం 8 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అవసరమైతే వీడియో రికార్డింగ్ చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే వెంటనే అధుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ జాబితాను జాబ్ వెరిఫికేషన్/వీసా/పాస్పోర్ట్/ఇన్సురెన్స్ తదితరాలకు లింక్ చేయనున్నట్లు చెప్పారు.
డ్రగ్స్ ముఠా అరెస్ట్
కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్కు డ్రగ్స్ తెచ్చిన ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. రూ.17 లక్షల విలువైన కొకైన్, హెరాయిన్, అల్ఫాజోలంలను పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేయగా బెంజిమన్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఫోన్ డేటా ఆధారంగా డ్రగ్స్ కొన్న వారిని గుర్తించారు.