భర్త కట్నం వేధింపు, బేగంపేటలో బెజవాడ యువతి సూసైడ్: కార్లు చోరీ చేస్తున్న టెక్కీ
హైదరాబాద్: వరకట్నం వేధింపులకు మరో యువతి బలైంది. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన లక్ష్మీకి హైదరాబాదులో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న విదేష్తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, గత కొద్దికాలంగా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కారణంగానే లక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లక్ష్మీ, విదేష్ల వివాహం రెండేళ్ల క్రితం జరిగింది. అప్పుడే లక్ష్మీ తల్లిదండ్రులు భారీ కానుకలు ముట్టచెప్పారు. ఇటీవల విదేష్కు పదోన్నతి లభించింది.
దీంతో అతను, తనకు పదోన్నతి వచ్చిందని చెబుతూ.. మరింత కట్నం కోసం లక్ష్మీని వేధించాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. టెక్కీ విదేష్ పైన లక్ష్మీ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కార్లు చోరీ చేసిన టెక్కీ
సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న వ్యక్తి కార్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి పోలీసులకు చిక్కాడు. క్యాబ్ డ్రైవర్ అర్జున్ బుధవారం రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం క్యాబ్లో వస్తున్నాడు.
అతను గచ్చిబౌలిలో మూత్ర విసర్జన కోసం దిగాడు. అతను అటు వెళ్లగానే ఓ వ్యక్తి కారుతో ఉడాయించాడు. వెంటనే అర్జున్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రాయదుర్గం పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గోల్కొండ పిఎస్ పరిధిలో కారును స్వాధీనం చేసుకున్నారు.
కారుతో ఉడాయించిన టెక్కీని సయ్యద్ ఇజాజ్గా గుర్తించారు. అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. తాను సాఫ్టువేర్ ఇంజినీర్నని చెప్పాడు. మంగళవారం ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో కూడా ఓ స్విఫ్ట్ కారును దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఇజాజ్ను అరెస్టు చేసిన పోలీసులు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.