ఆత్మహత్య: అదనపు కట్నంకోసం భార్యను వేధించిన సాప్ట్వేర్ ఇంజనీర్
హైదరాబాద్: ఇద్దరూ ఉద్యోగులు, మంచి జీతం.... మ్యారేజి అనంతరం కొద్ది రోజులపాటు వారి జీవితం సుఖంగా సాగింది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు రావడంతో తరచూ గొడవ పడేశారు. ముఖ్యమంగా అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో ఆ ఇల్లాలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ సంఘటన బేగంపేట ప్రకాశ్ నగర్లో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కుర్చేడు మండలంలోని పొట్లపాడుకు చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు, సరోజిని కుమార్తె రామలక్ష్మికి గుంటూరుకు చెందిన పొట్టి యోగేష్తో 2013లో వివాహం జరిగింది.
యోగేష్ సాప్ట్వేర్ ఇంజనీర్, రామలక్ష్మీ రైల్వే పోస్టల్ విభాగంలో ఉద్యోగి. వివాహ సమయంలో రూ. 3 లక్షల కట్నంతో పాటు నగలు, వస్తువులను కానుకగా ఇచ్చారు. ఇరువురు హైదరాబాద్లోని ప్రకాశ్ నగర్ 12 ఎస్ఆర్టీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.
ఈ క్రమంలో భర్త అదనపు కట్నం తేవాలని వేధించడంతో రామలక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తన భార్య తప్పిపోయిందని యోగేష్ 2015 జులై 17వ తేదీన బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పెద్దల వరకు వెళ్లడంతో వారు నగరానికి వచ్చి ఇద్దరికి సర్దిచెప్పి వెళ్లిపోయారు.
అనంతరం కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఈ నెల 22న విధులు పూర్తయిన తర్వాత రామలక్ష్మీ తన స్నేహితురాలితో కలిసి షాపింగ్కు వెళ్లి వచ్చింది. 23న ఏం జరిగిందోగానీ ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో భర్త ఇంట్లో లేడు.
విషయం తెలుసుకున్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బస్వారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. మృతురాలి బంధువులు రాకపోవడంతో 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఇటీవల విదేష్కు పదోన్నతి లభించింది. దీంతో అతను, తనకు పదోన్నతి వచ్చిందని చెబుతూ మరింత కట్నం కోసం లక్ష్మీని వేధించాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పోలీసులు రామలక్ష్మీ కేసును మొదట్లో 174 సెక్షన్ కింద నమోదు చేశామని, అయితే మృతురాలి పెదనాన్న విశ్వనాథం ఫిర్యాదుతో కేసును 304బీ కిందకు మార్చామని సీఐ తెలిపారు.