గోదావరిఖనిలో దారుణం: లెక్చరర్ 'ప్రేమ' వేధింపులకు విద్యార్థిని బలి!
కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిట్యాల రోహిత్ అనే వ్యక్తి సౌమ్యను కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
గోదావరిఖని: విద్యాబుద్దులు నేర్పించాల్సిన అధ్యాపకులే విద్యార్థులను ప్రేమ పేరుతో వేధిస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో చాలానే బయటపడుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో లెక్చరర్ ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని అన్యాయంగా బలైపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఉన్న గౌతమి సాయి డిగ్రీ కళాశాలలో సౌమ్య అనే విద్యార్థిని ఇటీవలే మొదటి సంవత్సరం పూర్తి చేసింది. అయితే ఇదే కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న చిట్యాల రోహిత్ అనే వ్యక్తి సౌమ్యను కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఇదే విషయం సౌమ్య ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఇటీవల వేధింపులు మరింత ఎక్కువవడంతో సోమవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయ్ నగర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడగా.. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో.. అక్కడినుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ సౌమ్య మంగళవారం నాడు ప్రాణాలు విడిచింది. సౌమ్య మరణంతో లెక్చరర్ రోహిత్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.