హరికృష్ణ ఆసక్తికరం, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ పథకాలపై మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని వ్యాఖ్యానించారు.
మహానాడులో రేవంత్ రెడ్డి హల్చల్, ఏపీ నేతల ఆశ్చర్యం
హరికృష్ణ ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వాలు పాత పథకాలకు కొత్త కలరింగ్ ఇచ్చి వాటిని తమ పథకాలుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
హరికృష్ణ నివాళి
ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరని హరికృష్ణ అన్నారు. ఆయన దూరమై ఇన్ని సంవత్సరాలు అయినా, ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి తెలుగు వారికి పండుగ రోజు అన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేవిని అన్నారు.
పథకాలపై ఎద్దేవా
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలే ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో అమలవుతున్నాయని హరికృష్ణ అన్నారు. మహిళలు ఒంటరిగా తిరుగుతున్నారంటే అది ఎన్టీఆర్ పాలన వల్లే అన్నారు. ఎన్టీఆర్ అనుకున్నది సాధించి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు.
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
రాజకీయ వెన్నుపోటుతో ఎన్టీఆర్ మృతి చెందారని వైసిపి నేత లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఎన్టీఆర్ హయాంలో నిర్వహించే ప్రతి మహానాడు పేదవాళ్లకు ఉపయోగపడేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
ఫిరాయింపులకు ఎన్టీఆర్ వ్యతిరేకం
పేదల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం ఇప్పుడు పెద్దల పార్టీగా మారిందని లక్ష్మీపార్వతి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ఎన్టీఆర్ ముందు నుంచే వ్యతిరేకించారని, అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో హత్యా రాజకీయాలు
ఏపీలో ఎన్టీఆర్ ఆశయాలు అన్నీ పక్కకు వెళ్లిపోయాయని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు చంద్రబాబుకు మహానాడు నిర్వహించే అధికారం కానీ, అర్హత కాని లేదని ఆమె అన్నారు. ఏపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు.టిడిపి తెలంగాణలో చచ్చిపోయిందని, ఏపీలో ఉన్నా లేనట్లేనని వ్యాఖ్యానించారు.