మా నాన్నకు ఏదైనా అవుతుందంటే: కన్నీళ్లు తెప్పిస్తున్న జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా గతంలో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తన తండ్రి గురించి మాట్లాడిన వాటిని అందరు గుర్తు చేసుకుంటున్నారు.
'మా నాన్నకు ఏదైనా అవుతుందంటే నేను ఊహించుకోలేను' అని ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకొని అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. జూ.ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రెండేళ్ల క్రితం విడుదలైంది. ఈ సినిమాలో నాన్నకు ప్రేమతో అనే పాట పాపులర్.
తండ్రిపై ప్రేమ
నాన్నకు ప్రేమతో చిత్రం ఆడియో విడుదల సందర్భంగా తన తండ్రి హరికృష్ణతో కలిసి ఎన్టీఆర్ వేదికపై మాట్లాడారు. తనకు తన తండ్రిపై ఉన్న ప్రేమను చెప్పారు. తాను సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు తనకు ధైర్యం చెప్పి, వెన్నుతట్టి, నాపై నాకు నమ్మకం కలిగేలా చేసింది తన తండ్రి హరికృష్ణే అన్నారు. తన తండ్రి ఎప్పుడూ మా ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే చెప్పేవారని..కింద పడండి.. చావుదాకా వెళ్లండి, కానీ, మిమ్మల్ని మీరు నమ్ముకుని పైకి రండి అని చెప్పేవారన్నారు.
Recommended Video
నాకు దేవుళ్లు వారే
తన తండ్రి ఏ రోజూ పిరికివారిలా బతకడం తమకు నేర్పించలేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆయన పేరు, తాతగారి పేరు చెప్పుకొని బతకడం నేర్పలేదని, మాకు మమ్ముగా బతకమని చెప్పారన్నారు. నేను 25 సినిమాల్లో చేశానంటే అందుకు కారణం తన దేవుళ్లు తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ అన్నారు.
మా నాన్నకు ఏదైనా అయిపోతుందంటే ఊహించుకోలేను
జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ... నాన్నకు ప్రేమతో కథ చెప్పినప్పుడు చాలా భయపడ్డానని, మా నాన్నకు ఏదైనా అయిపోతుందంటే నేను ఊహించుకోలేనని, మనిషిని మామూలుగా ఉండలేనని, అలాంటిది ఆయనకున్న బాధను దిగమింగుకొని వాళ్ల నాన్నకు నివాళిగా ఈ కథ రాశారని చెప్పారు.
విషాదం నింపిన హరికృష్ణ
తమ కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలోనూ జరగకూడదని, కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. 2014 జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటి నుంచి రోడ్డు భద్రతపై ఎక్కువగా చెబుతున్నారు. కానీ ఇప్పుడు హరికృష్ణ మృతికి సీటు బెల్టు పెట్టుకోకపోవడం కూడా కారణం.