టీఆర్ఎస్ కి ధీటుగా హరీష్ కొత్త పార్టీ..! కేసీఆర్ను కలవర పెడుతున్న కాళేశ్వరం..!!
హైదరాబాద్: గత ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందన్న సత్యాన్ని కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకోవడమే అందుకు ఉదాహరణ. శాసనసభ ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా తామేనని బీజేపీ చెబుతుండటంతో గులాబీ పార్టీ ఆలోచనలో పడింది.
ఏకంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ర కవిత ఓడిపోవడం ఆ స్థానంలో బీజేపీ గెలుపొందడంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. దీనికి సంబంధించి చంద్రశేఖర్ రావు తో పాటు హరీష్ రావు చర్చలు జరిపారు. వారి చర్చల్లో భాగంగా కొత్త పధకం ప్రకారం తమ ప్రణాళికలు అమలు చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Recommended Video
కాళేశ్వరం అంశంలో హరీష్ ను ఒంటరి చేసిన మామ..! కొత్త పార్టీతో ప్రజల ముందుకు అల్లుడు..!!
శుక్రవారం ప్రారంభమైన భారీ ఎత్తిపోతల పథకం 80వేలకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు 4,992మెగావాట్ల విద్యుత్ ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ కు సాగు, త్రాగు నీటి సమస్య తీరనుందని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్య పాత్ర పోషించిన హరీష్ రావును మాత్రం పిలవకపోవడంపై సర్వాత్రా చర్చ మొదలైంది. అటు హరీష్ రావు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో యుద్ధానికి దిగారు. పలువురు రాజకీయ నాయకులు మాత్రం ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అని కొట్టిపారేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరే పార్టీ నిలవకుండా హరీశ్ రావు ను రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచిచూడాలి.
ప్రభావితం చేయనున్న హరీష్ రావు..! హరీష్ తోనే రాజకీయాల్లో మరో కీలక మార్పు..!!
ఎవరు అవునన్నా.. కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ భవిశ్యత్ రాజకీయాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయనే చర్చ జరుగుతోందది. ఎవరి కష్టాన్ని కనిపించకుండా చేశారో.. దానికి సంబంధించి మ్యూలం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టును ఏళ్లకు ఏళ్లు నిర్మించే తీరుకు భిన్నంగా.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి.. స్వల్ప వ్యవధిలో భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టును పూర్తి చేయటం మామూలు విషయం కాదు. ఇవాల్టి రోజున ఒక పెద్ద నిర్మాణ వెంచర్ ను పూర్తి చేయటానికి మూడు.. నాలుగేళ్లు పడుతున్న వేళ..అంతకంటే తక్కువ సమయంలో ఒక భారీ ప్రాజెక్టును పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే.. ఈ ప్రాజెక్టు సాంకేతిక అద్భుతంగా పలువురు అభివర్ణించటాన్ని మర్చిపోకూడదు. అన్నింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండే చంద్రశేఖర్ రావు, కొన్నింటి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అల్లుడిని అటకెక్కించిన మామ..! అసలు సమయానికి తగ్గించిన ప్రాధాన్యత..!!
కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పినంతనే చంద్రశేఖర్ రావు పేరు ఎలా గుర్తుకు వస్తుందో.. హరీశ్ రావు పేరు అంతే ఎక్కువగా గుర్తుకు వస్తుంది. అయితే ఇంట్లో లేదంటే ఫాంహౌస్ లో కూర్చొని కాగితాల మీదా.. గూగుల్ మ్యాప్ ల మీద పని సలహాలు ఇచ్చింది చంద్రశేఖర్ రావు అయితే.. వాటిని తూచా తప్పకుండా అమలు చేయటంతో పాటు.. పనిని పరుగులు తీయించటంతో పాటు.. సాంకేతిక అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం, పొరుగు రాష్ట్రంలో ఉన్న అవరోధాలను, వివాదాలను గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేసిన సమర్థత చంద్రశేఖర్ రావు మేనల్లుడు, ఆనాటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు సొంతం.
అట్ట హాసంగా కాళేశ్వరం లాంచింగ్..! తొక్కి పెట్టిన హరీష్ సేవలు..!!
అలాంటి హరీశ్ రావు పేరు.. ప్రస్తావన అన్నది తీసుకురాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్న చంద్రశేఖర్ రావు తీరును పలువురు తప్పు పడుతున్నారు. అయితే క్రెడిట్ తనకు కానీ.. తన కొడుక్కి కానీ రావాలే తప్పించి మిగిలిన వారెవరికీ రాకూడదన్న చంద్రశేఖర్ రావు తీరుపై పలువురు మండిపడుతున్నారు. హరీశ్ రావు ను తొక్కేసేందుకు ఎలాంటి మొహమాటాలకు పోని చంద్రశేఖర్ రావు తత్త్వం రానున్న రోజుల్లో ఆయనకు తలనొప్పిగా మారతుందంటున్నారు. ఏ ఆలోచనతో అయితే హరీశ్ రావు ప్రస్తావన లేకుండా చంద్రశేఖర్ రావు వ్యవహరించారో.. అదే ఆయనకు పీడకలగా మారుతుందని.. కాళేశ్వరం ఓపెనింగ్ డేట్ చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు జూన్ 20 ఒక ల్యాండ్ మార్క్ గా మారుతుందన్న మాట తెలంగాణ వాదుల నుండే కాకుండా హరీష్ అనుచరులనుండి పెద్ద యెత్తున వినిపిస్తోంది. ఇదే తరుణంలో హరీష్ గులాబీ పార్టీకి ధీటుగా మరో పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.