ఆంధ్రావాళ్లే: హరీష్, గుంటనక్క కెసిఆర్కు తాగడం తప్ప: శోభారాణి, కవిత రిజైన్ చెయ్
హైదరాబాద్: గత ప్రభుత్వాల ఆంధ్రా పాలకులు దేవాదుల ఫేజ్ 1, 2ను నిర్లక్ష్యం చేశారని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పాలకుర్తి రైతులు మంత్రిని కలిసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రిని రైతులు కలిశారు. ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 8 గ్రామాలకు నీరందిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు (ఎస్పారెస్పీ) ఫేజ్-2లో నీరు వచ్చేలా చూస్తామన్నారు.
కెసిఆర్పై విరుచుకుపడ్డ శోభారాణి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు శోభారాణి విరుచుకుపడ్డారు. మాయమాటలతో ప్రజలను వంచించి, అధికారాన్ని చేజిక్కించుకున్న ఓ గుంటనక్క కేసీఆర్ అన్నారు.
తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. అధికారం రాగానే, పదవీ వ్యామోహంతో తానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారన్నారు. చీప్ లిక్కర్ తీసుకురావాలని కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేశారని, చీత్కారాలు తప్పవని మహిళలు హెచ్చరించడంతో, తిరగబడతారనే వెనుకడుగేశారన్నారు.
సైకిల్ గుర్తు పైన గెలిచిన చల్లా ధర్మారెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసమే టీఆర్ఎస్లో చేరారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ... సీసాలు ఖాళీ చేయడం తప్ప నాయకులను తయారు చేసుకోవడం కేసీఆర్కు రాదన్నారు.
కవిత రాజీనామా చేసి మాట్లాడాలి
నిజామాబాద్ ఎంపీ కవిత తన పదవికి రాజీనామా చేసి ఆత్మహత్యల పైన మాట్లాడాలని శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి కెసిఆర్కు చెప్పి సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. కవిత ఎంపీ పదవికి రాజీనామా చేసి సమావేశాలు పెడితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో ఈ నెల 16న గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామన్నారు.