మేం ఆదుకున్నా, ఏపీది విచిత్ర వైఖరి, ఆ 'శక్తి' తెలుసు: హరీష్, కేంద్రంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నది నీళ్ల పైన ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు మండిపడ్డారు. నీటి సమస్యను రెండు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాలని అన్నారు. ఎన్డబ్ల్యూడీఏ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం విచిత్ర వైఖరి అవలంభిస్తోందని, కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు పెడుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా.. ఏ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా కృష్ణా నీటిని వాడుకోవాలని మేం కోరుకుంటున్నామని చెప్పారు.
కేఆర్ఎంబీ సూచనల మేరకు మేం వాడుకుంటున్నామని చెప్పారు. ఏపీ వితండ వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీ తీరు సరికాదన్నారు. గోదావరి నదిలో నీటి లభ్యత పైన స్వతంత్ర దర్యాఫ్తుతో దర్యాఫ్తు జరిపించాలన్నారు.
నీటి లభ్యత ఉంటే నదుల అనుసంధానంపై అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాల సమ్మతితోనే నదుల అనుసంధానం జరగాలన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు గేట్లు ఎత్తితే ఎలాగన్నారు. తమకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉందన్నారు. తమకు రావాల్సిన నీటిని ఇవ్వమంటే ఏపీ ముందుకు రావట్లేదన్నారు.
ఎన్డబ్ల్యూడీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇవాళ సమావేశాలు అసమగ్రంగా, అపరిష్కృతంగా ముగిశాయన్నారు. రేపు ఉదయం మరోసారి భేటీ అవుతామన్నారు. మీకు మూడో పంటకు నీళ్లు కావాలంటే, మాకు ఒక్క పంటకైనా నీరు వద్దా అని ప్రశ్నించారు. ఏపీది ఇదేం పద్ధతి అన్నారు.
ఏపీ ముందుకు రావడం లేదు
మేం మహారాష్ట్రతో, కర్నాటకలో సత్సంబందాలు పెట్టుకున్నామని చెప్పారు. కరువు వచ్చింది ఓ టీఎంసీ నీళ్లు ఇవ్వమంటే ఇచ్చారన్నారు. తాము పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు పెట్టుకొని, కలిసి పని చేసే ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నామన్నారు. మరి ఏపీ అలా ఎందుకు ముందుకు రావడం లేదన్నారు.
కలిసి పని చేయాలంటే ఇరు రాష్ట్రాల నుంచి మంచి స్పందన రావాలని, కానీ ఏపీ నుంచి అలా రావడం లేదన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా కృష్ణా నీటిని వాడుకుందామన్నారు. బచావత్ ట్రైబ్యునల్ పెండింగులో ఉంటే కేఆర్ఎంబీ ఎలా అమలు చేస్తారన్నారు.
ఏపీ రైతులను ఆదుకున్నాం
విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు కేవలం రెగ్యులేట్ మాత్రమే చేస్తుందన్నారు. కృష్ణాలో 811 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, కేవలం 190 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. తాము నాగార్జున సాగర్ ద్వారా ఎక్కువ నీటిని ఇచ్చి ఏపీ రైతులను ఆదుకున్నామని చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని ఏపీ రాజ్యసభలో చెప్పిందన్నారు. ఓ ప్రాజెక్టును తామే నిర్వహించుకోవాలని చెప్పడం సరికాదన్నారు. పోతిరెడ్డిపాడులో ఇవ్వరు కానీ, నాగార్జున సాగర్ మాత్రం తీసుకు వెళ్తానని చెప్పడం ఏమిటన్నారు.
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంది
మొదటి నుంచి కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు. తాము కేంద్రంతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు. హైకోర్టు విభజన కోసం ఇప్పటికీ న్యాయవాదులు కొట్లాడుతున్నారన్నారు. విభజన జరగకపోవడం వెనుక ఏ శక్తి ఉంది, ఎవరు ఉన్నారనే విషయం అనవసరమని, ఎవరో అందరికీ తెలుసునని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. మొదట్లోనే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేశారన్నారు. కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అస్పష్టంగా ముగిసిందని, ఏదేమైనా గురువారం మరోసారి భేటీ అవుతున్నామని చెప్పారు.