హరీష్రావుకు తప్పిన ప్రాణాపాయం: తమ్మలను మధ్యలోనే వదిలి, గాల్లోనే చక్కర్లు కొట్టిన హెలిక్యాప్టర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సోమవారం నాడు పెను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.వాతావరణం బాగా లేక ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్కు బేగంపేట విమానాశ్రయంలో ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు.
దాంతో హెలికాప్టర్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. హకీంపేట సైనిక ఎయిర్పోర్టులో అనుమతి లేకున్నా బలవంతంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ఠ్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు ఖమ్మం జిల్లా పర్యటన నుండి హైద్రాబాద్కు ప్రైవేట్ హెలిక్యాప్టర్లో సోమవారం సాయంత్రం హైద్రాబాద్కు చేరుకొన్నారు.
Recommended Video
వాతావరణం సరిగా లేదని బేగంపేట ఎయిర్పోర్ట్లో మంత్రి హరీష్రావు హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతించలేదు అధికారులు.
అయితే అప్పటికే హరీష్రావు ప్రయాణీస్తున్న హెలిక్యాప్టర్లో 15 నిమిషాలకు మాత్రమే సరిపడు ఇంధనం ఉంది. దీంతో పైలెట్ హెలికాప్టర్ను హైదరాబాద్ శివార్లలోని హకీంపేట ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దింపారు. అనుమతి లేకున్నా ఈ హెలిక్యాప్టర్ను ల్యాండ్ చేయడంతో మంత్రి హరీష్రావు ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.
ప్రభుత్వ హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపం
ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన కోసం మంత్రి హరీష్రావు సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళారు. సోమవారం ఉదయం 8 గంటలకే హైదరాబాద్ నుంచి బయలుదేరేందుకు ఆయన సిద్ధమైనా.. ప్రభుత్వ అధీనంలోని హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సమయం సరిపోదన్న ఉద్దేశంతో అద్దెపై బెంగళూ రు నుంచి ప్రైవేటు హెలికాప్టర్ను తెప్పించారు. బెంగుళూరు నుండి హెలిక్యాప్టర్ హైద్రాబాద్ వచ్చాక మంత్రి హరీష్రావు మధ్యాహ్నం ఒంటిగంటకు హైద్రాబాద్ నుండి ఖమ్మం బయలుదేరారు.
పలు ప్రాజెక్టులను పరిశీలించిన హరీష్
ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను మంత్రి హరీష్రావు సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు.ప్రాజెక్టులను పరిశీలించి వస్తూ..
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆహ్వానం మేరకు.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సోమవారం జరిగిన పలు ప్రాజెక్టు పనుల కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. పాలేరు, వెంకటాపురం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా.. చీకటి పడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తిరుగు ప్రయాణమయ్యారు.
తుమ్మలను భద్రాద్రిలోనే వదిలిన హరీష్
మంత్రి హరీష్రావు సాయంత్రం హడావుడిగా హెలిక్యాప్టర్లో హైద్రాబాద్కు బయలుదేరారు. చీకటిపడితే హెలిక్యాప్టర్ ల్యాండింగ్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నందున సాయంత్రం 4.30 గంటల సమయంలో భద్రాద్రిలోనే మంత్రి తుమ్మలను దింపేశారు. అక్కడి నుండి నేరుగా హైదరాబాద్కు బయలుదేరారు హరీష్రావు. హైద్రాబాద్కు చీకటి పడక ముందే చేరాలనే ఉద్దేశ్యంతోనే మంత్రి తుమ్మలను మధ్యలోనే వదిలేశారు.
బేగంపేటలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి నిరాకరణ
వాతావరణం సహకరించకపోవడంతో మంత్రి హరీశ్రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాయంత్రం 5.40 గంటల సమయంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. కానీ భారీ వర్షం కురుస్తుండడంతో.. ల్యాండింగ్కు వాతావరణం అనుకూలంగా లేదంటూ బేగంపేట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి నిరాకరించింది.
ప్రమాదకరంగా హకీంపేటకు ప్రయాణం
భారీ వర్షం కారణంగా కనీసం ఐదు వందల మీటర్ల దూరం కూడా కనిపించని స్థితిలో పైలెట్ హకీంపేటకు హెలిక్యాప్టర్ను మళ్ళించారు.సైనిక అవసరాలు, సైనిక శిక్షణ విమానాల కోసం హకీంపేట విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు. హకీంపేట విమానాశ్రయంలో గాంధీ జయంతి సెలవు సందర్భంగా సోమవారం ఏటీసీ మూసేసి ఉంది. దీంతో పైలట్ ఏటీసీని సంప్రదించలేకపోయారు. అటు బేగంపేట విమానాశ్రయంలో రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ల్యాండింగ్కు అనుకూల వాతావరణం లేదని హెచ్చరికలు వచ్చాయి. కానీ హెలికాప్టర్లో పది పదిహేను నిమిషాల పాటు మాత్రమే సరిపోయేలా ఇంధనం ఉంది. దీంతో పైలట్ విధిలేని పరిస్థితుల్లో ఏటీసీ అనుమతి లేకుండానే హకీంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ను సురక్షితంగా దింపారు. అయితే అనివార్య పరిస్థితుల్లోనే హెలిక్యాప్టర్ను ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆర్మీ అధికారులకు వివరించారు. దీంతో వారు కూడ పరిస్థితిని అర్థం చేసుకొన్నారు.