అప్పటి మంత్రులేం చేశారు?, కిరణ్ రెడ్డి ఒప్పందం ఇదే: హరీశ్
హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతోన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రతిపక్ష కాంగ్రెస్ పదేపదే విమర్శించండంపై మంత్రి హరీష్రావు మండిపడ్డారు. మహారాష్ట్రతో ఒప్పందంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో చేసుకున్న ఒప్పందాన్ని హరీశ్ రావు మీడియాకు అందించారు.
అప్పుడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డిలు ఏం చేశారని నిలదీశారు. ప్రాణహిత పేరుతో 14వందల కోట్లు నొక్కేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పాపాలను కడిగి బంగారు తెలంగాణాగా మారుస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద, ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై అవాక్కులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు వాళ్లు అధికారంలో ఉన్నపడు ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఇవాళ ప్రాజెక్టులకు ఈ దుస్థితి పట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం సవరించుకుంటూ ముందుకు పోతోందని వివరించారు. తమ ప్రభుత్వం అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణలోని పంట పొలాలకు నీరందించేలనేదే తమ తపన అని చెప్పారు.
2014లో కేంద్రంలో, ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మరి అప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ఎత్తును 152 మీటర్లు ఎందుకు పెంచలేక పోయారని నిలదీశారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాళ్లకు వాళ్లు ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లుగా ఊహించుకొని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారని ధ్వజమెత్తారు.
ప్రాణహిత పేరుతో రూ.1400 కోట్ల దొంగ బిల్లులు సృష్టించారని ఆరోపించారు. ఒక ప్రాజెక్టు కడుతున్నపుడు కనీసం సంబంధిత రాష్ట్రం, పొరుగు రాష్ట్రంతో చర్చించాలన్న ఇంగీత జ్ఞానం కూడా వాళ్లకు లేకుండేనని మండిపడ్డారు.
కమిషన్ల కోసమే కాలువలు తవ్వారని నిజంగా సాగునీరును తేవాలనే ఉద్దేశ్యం వారికి లేకుండేనని వివరించారు. చర్చలు లేకుండానే టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రతో వ్యూహాత్మకంగా చర్చలు జరిపి సాగునీరు తేవడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తోంటే ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.
మహారాష్ట్రలోని ప్రాణహిత ఎత్తుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి హయాంలో చేసిన పాపాలను సరిదిద్ది ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారని, అందుకు అక్కడి సర్కార్అభ్యంతరం తెలిసిందని అన్నారు. 2007లో 'ప్రాణహిత' తొలి జీవో వస్తే 2013 వరకు పట్టించుకోలేదని, ఆ ప్రాజెక్టు పేరిట రూ.1,400 కోట్ల బిల్లులు సృష్టించారని ఆరోపించారు.