టీడీపీ, కాంగ్రెస్ గ్రామాల వైపు కన్నెత్తి చూడొద్దు : రైతులకు హరీశ్ రావు పిలుపు
మెదక్ : తెలంగాణ ప్రతిపక్షాలపై మండిపడ్డారు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఏ మాత్రం పట్టించుకోని టీడీపీ, కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కూడా ప్రాజెక్టులకు అడ్డుపడుతూనే ఉన్నారని, అందుకే టీడీపీ, కాంగ్రెస్ నేతలను గ్రామాల వైపు కన్నెత్తి చూడకుండా చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాల హయాంలో మంత్రులుగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి వంటి నేతలు తెలంగాణలో ఒక్క కల్వర్ట్ అయినా నిర్మించారా..? చెరువుల్లో పూడికతీతైనా తీయించే ప్రయత్నం చేశారా..? అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో కూర్చొన్నప్పుడు మరొకలాగా ఆ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తే క్రెడిట్ అంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డు పుల్లలు వేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరు గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలో రూ.125 కే ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తుందన్నారు. రూ.620 కోట్లతో మెదక్ జిల్లా విద్యుత్ రంగాన్ని పట్టిష్టం చేయబోతున్నామని ప్రకటించారు.