హరీష్ రావు దూసుకెళుతున్నారుగా.. అప్పుడలా, ఇప్పుడిలా..!
మెదక్ : మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దూసుకెళుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో సిద్ధిపేట రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన హరీష్ రావు.. ఆ దిశగా పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేటకు టాప్ సెకండ్ ప్లేస్ వచ్చేలా కృషి చేశారు.
పదవులుంటేనే పనిచేస్తారనే దానికి హరీష్ రావు విధానం వ్యతిరేకంగా కనిపిస్తుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయినా కూడా ఆయన పనితీరులో ఎలాంటి తేడా లేదు. మంత్రి పదవి ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఎలాంటి సేవలందించిరో ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. మొత్తానికి సిద్దిపేటను పరుగులు పెట్టించడమే ఆయన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు.
గల్లీ, యూత్ లీడర్లు సైతం.. మున్సిపల్ పోరుకు సన్నద్ధం.. ఈసారి రసవత్తర పోటీయేనా?
హరీష్ రావు భేష్.. రోడ్డు ప్రమాదాలకు బ్రేక్
రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా చూసినా రోజుకో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సిద్ధిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన బ్లాక్ స్పాట్ ఏరియాల్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం విశేషం. వాహనాల వేగానికి కళ్లెం వేస్తూ.. వాహనాలు నడిపేవారిని అలర్ట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సిద్దిపేటను అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తున్న హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటి ఎమ్మెల్యే ప్రతిచోట ఉంటే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
నెత్తురోడకుండా జాగ్రత్తలు.. ప్రమాదాల నివారణకు చర్యలు
సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్ నేషనల్ హైవే దాదాపు 92 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇటు ములుగు మండలం ఒంటి మామిడి గ్రామం నుంచి అటు బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామం వరకు జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే 92 కిలోమీటర్ల పరిధిలోని ఈ ఏరియాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటం.. నెత్తురోడుతుండటం కామన్గా మారింది. అందుకే ప్రమాదాల నివారణకు జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఆ క్రమంలో అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. అయితే గత పదిహేనురోజులుగా బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ఒక్క ప్రమాదం జరగకపోవడం విశేషం.
ఆ ప్రాంతాల్లో జాగ్రత్తలు.. ప్రమాదాలు తగ్గాయిగా..!
ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఏరియాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారిని అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకున్నారు. రేడియం స్టిక్కర్లు, బారికేడ్లు తదితర ఏర్పాట్లతో ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేస్తున్నారు. దాంతో వాటిని ఫాలో అవుతూ వాహనదారులు అప్రమత్తమవుతున్నారు. సిద్దిపేట, గజ్వేల్, కుకునూరుపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే వాటిని ఏర్పాటు చేశారు.
దాదాపుగా నెల రోజుల నుంచి ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక రాజీవ్ రహదారి వెంట ఉన్న బైపాస్ రోడ్లు, గ్రామాలకు వెళ్లే లింకు రోడ్ల దగ్గర స్పీడ్ కంట్రోల్ తదితర బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
8 నెలల వ్యవధిలో 80 సీసీ కెమెరాలు..
రాజీవ్ నేషనల్ హైవేపై ప్రధాన కూడళ్లు, బ్లాక్ స్పాట్స్ దగ్గర 8 నెలల వ్యవధిలో దాదాపు 80 సీసీ కెమెరాలు బిగించడం విశేషం. వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్న తీరును తెలుసుకోవడంతో పాటు సత్వర చర్యలు చేపట్టడానికి వీలవుతోంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ప్రతి నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సగటు చూసినట్లయితే రోజుకు రెండు లేదా మూడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనేది ఒక అంచనా. అయితే అధికారులు తీసుకుంటున్న చర్యలతో ప్రమాదాల సంఖ్య కాసింత తగ్గుముఖం పడుతోంది. దాంతో పూర్తిస్థాయిలో ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అధికారులతో ఎప్పటికప్పుడూ టచ్లో ఉంటూ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.
అంత ఘోరమా.. స్కూల్లో ర్యాగింగా.. 10వ తరగతిలోనే అరాచకమా?
హరీష్ రావు లక్ష్యానికి మెరుగైన ఫలితాలు.. పది ఫలితాల్లో టాప్ సెకండ్
అభివృద్దిలో సిద్దిపేట తెలంగాణకు తలమానికంగా నిలుస్తోంది. అన్నిరంగాల్లో అతివేగంగా వృద్ది సాధిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. అయితే దాని వెనుక హరీష్ రావు ఎనలేని కృషి ఉంది. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. విద్యారంగం కూడా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈసారి పదో తరగతి ఫలితాలపై దృష్టి సారించారు హరీష్ రావు.
ఆ క్రమంలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అప్పట్లో లేఖలు రాశారు. మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఆయన ఆశయాలకు అనుగుణంగా పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండో స్థానం సాధించడం విశేషం. 2016 - 17 లో సిద్దిపేట జిల్లాకు 9వ స్థానం దక్కింది. ఆ తర్వాత 2017-18 అకాడమిక్ ఇయర్ కు గాను 3వ స్థానం లభించింది. ఈసారి రెండో స్థానం కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 99.73 శాతం ఉత్తీర్ణత సాధించి జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. 99.33 శాతంతో సిద్దిపేట జిల్లా రెండో స్థానం కైవసం చేసుకుంది. జస్ట్ 0.4 శాతం తేడాతో ఫస్ట్ ప్లేస్ మిస్సయింది. మొత్తానికి రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా సిద్దిపేటను తీర్చిదిద్దుతున్న హరీష్ రావుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.