బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?
హైదరాబాద్: మహాకూటమితో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఆంధ్రాబాబేనని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. మహాకూటమి పొత్తులపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
మహాకూటమి షరతులతోనేనా?
గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాతే టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుందని హరీశ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీతో కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమని ప్రకటించిన తర్వాతే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులను తృణప్రాయంగా కూడా వదులుకున్నామని హరీశ్ రావు చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేశామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు టీడీపీతో మహా కూటమిగా ఏర్పాటవుతున్నది షరతులతోనా? కాదా? అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
చంద్రబాబు అన్నింటా అడ్డే...
తెలంగాణ ఏర్పాటును చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు అని హరీశ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తామని పొలిట్ బ్యూరోలో టీడీపీ ఏమైనా తీర్మానం చేసిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. పోలవరం, నదీ జలాల పంపిణీ, హైకోర్టు, ఆస్తుల పంపకం లాంటి విషయాల్లో చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల పట్ల వ్యతిరేకత చూపుతున్నారని ఏకంగా ప్రధాని కూడా చెప్పారని హరీశ్ అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళితే కేవలం తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతారని ప్రధాని చెప్పారని అన్నారు.
కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసి 7మండలాలను..
విభజన తర్వాత కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసి తెలంగాణలోని 7మండలాలను ఏపీలో కలుపుకున్నారని చంద్రబాబుపై హరీశ్ ధ్వజమెత్తారు. వాటిని తిరిగిస్తామని చంద్రబాబు ఏమైనా చెప్పారా? అని ఉత్తమ్ను ప్రశ్నించారు. ఆ 7మండలాలను తెలంగాణకు చంద్రబాబు ఇస్తారా? అని నిలదీశారు. పోలవరం డిజైన్ వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని డిజైన్ మార్చాలని తెలంగాణ కోరుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ప్రస్తావించిందా? అని హరీశ్ ప్రశ్నించారు. ఖమ్మం కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పోలవరంపై కేసు వేశారని, దీనిపై చంద్రబాబు వైఖరేంటని ప్రశ్నించారు. పోలవరం డిజైన్ ఏమైనా మారుస్తారా? అని హరీశ్ నిలదీశారు.
తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదులు
పాలమూరు-రంగారెడ్డి
ఎత్తిపోతల
ప్రాజెక్టు
అక్రమమని
కేంద్రానికి
చంద్రబాబు
లేఖలు
రాశారని
హరీశ్
రావు
గుర్తు
చేశారు.
కేంద్రమంత్రి
గడ్కరీకి,
ప్రధానికి
కూడా
పలుమార్లు
ఫిర్యాదు
చేశారని
చెప్పారు.
చంద్రబాబు
ఇప్పుడైమైనా
ఈ
ప్రాజెక్టు
సక్రమమేనని,
పాత
ప్రాజెక్టేనని
లేఖ
ఇచ్చారా?
అని
హరీశ్
రావు
ప్రశ్నించారు.
కాళేశ్వరం,
తదితర
ప్రాజెక్టులపై
చంద్రబాబు
చేసిన
ఫిర్యాదులేమైనా
వెనక్కి
తీసుకుంటామని
చెప్పారా?
అని
హరీశ్
రావు
ప్రశ్నించారు.
ఆ
ప్రాజెక్టులపై
తమకు
అభ్యంతరం
లేదని
చంద్రబాబు
అగ్రిమెంట్
ఏమైనా
మీతో
చేసుకున్నారా?
అని
కాంగ్రెస్
పార్టీని
నిలదీశారు.
45టీఎంసీల నీళ్లు కుండా అడ్డుకున్న బాబు
కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి వచ్చిన వెంటనే తెలంగాణకు నాగార్జున ప్రాజెక్టు నుంచి 45టీఎంసీల నీటిని కేటాయించాలని బచావత్ ట్రిబ్యూనల్ స్పష్టం చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. 2009లోనే పోలవరంకు అనుమతులు వచ్చినప్పటికీ.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఇప్పటి ఏపీ ప్రభుత్వం గానీ 45టీఎంసీల నీళ్లను ఇచ్చేందుకు సమ్మతించలేదని చెప్పారు. గత కొద్ది నెలల క్రితం కేంద్రమంత్రి ఉమాభారతి దగ్గర కేసీఆర్, తాను.. ఏపీ నుంచి చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు హాజరై ఈ విషయంపై చర్చించామని చెప్పారు. పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గట్టిగా కోరారని, చంద్రబాబు మాత్రం తెలంగాణకు 45టీఎంసీల నీరు ఇచ్చేది లేదని అన్నారని తెలిపారు. ఆ 45టీఎంసీల నీళ్లు తెలంగాణ ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పుడేమైనా సిద్ధంగా ఉన్నారా? అని హరీశ్.. కాగ్రెస్ను ప్రశ్నించారు.
చంద్రబాబు ఇల్లు హైదరాబాద్లోనే కానీ..
తెలుగు జాతి గురించి మాట్లాడే అర్హత ఎన్టీఆర్కు ఉంది కానీ, చంద్రబాబుకు లేదని అన్నారు. హైదరాబాద్తో సహా అన్ని గ్రామాలకు నీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపడితే.. దాని మీద కూడా చంద్రబాబు కేసులు వేశారని హరీశ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది కదా.. ఆయన కూడా కృష్ణా నీళ్లే తాగాలి కదా అని ప్రశ్నించారు. తాగే నీళ్లు కూడా అడ్డుకున్న చంద్రబాబుతో కలిసి మహాకూటమి ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? అని ప్రశ్నించారు.
బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ. కోటి నష్టం
తన 9వ ప్రశ్నంటూ.. బీజేపీ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటును చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ నుంచి లాక్కుందని అన్నారు. దీంతో తెలంగాణ కరెంటో కోతలు అనుభవించిందని చెప్పారు. 5వేల కోట్ల విలువైన ప్రాజెక్టును రాత్రికి రాత్రికి లాక్కున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు 365రోజులపాటు జల విద్యుత్ అందిస్తుందని, మిగితా ప్రాజెక్టులు వంద రోజులు కూడా విద్యుత్ అందివ్వవని చెప్పారు. ఈ ప్రాజెక్టును కోల్పోవడంతో తెలంగాణ రోజుకు రూ. కోటి నష్టపోతోందని హరీశ్ తెలిపారు. విభజన చట్టంలో లేకపోయిన ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గుంజుకున్నారని అన్నారు. 460 మెగావాట్ల ప్రాజెక్టు ఇదని, ఈ ప్రాజెక్టును ఏమైనా తిరిగి ఇస్తామని చెప్పారా? అని తెలంగాణ కాంగ్రెస్ను ప్రశ్నించారు.
తెలంగాణ ఆస్తిలో వాటా కావాలట..
ఇక 10వ ప్రశ్నంటూ.. 1200మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఏపీకి బదిలీ అయితే, వారిని చేర్చుకోలేదని హరీశ్ చెప్పారు. వారిని చేర్చుకుంటామని చెప్పారా? అని ప్రశ్నించారు. అంతేగాక, 1956కు ముందున్న నిజాం వారసత్వ సంపదలో కూడా వాటా ఇవ్వాలని చంద్రబాబు వాదిస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. తెలంగాణకు చెందిన ఆస్తిని కావాలంటూ కేసులు వేశారని అన్నారు. కేసులను ఉపసంహరించుకుని తెలంగాణ ఆస్తులను తెలంగాణకే దక్కేలా చూస్తామని చంద్రబాబు ఏమైనా మాట ఇచ్చారా? అని మహాకూటమి ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని హరీశ్ ప్రశ్నించారు.
తెలంగాణను నిలబెట్టేందుకు కేసీఆర్.. పడగొట్టేందుకు బాబు..
అంతేగాక, హైకోర్టు భవనం ఏర్పాటు చేసుకోకుండా హైకోర్టు విభజనను ఏపీ అడ్డుకుంటోందని హరీశ్ అన్నారు. తెలంగాణకు న్యాయంగా వచ్చే వాటాలను కూడా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇవన్నీ తేలకుండా మహా కూటమిని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఉత్తమ్ను హరీశ్ నిలదీశారు. కామన్ మినిమమ్ ప్రొగ్రాంలో స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. చంద్రబాబు దీనిపై సంతకాలు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణను నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి చంద్రబాబుతో పొత్తా? అని హరీశ్ రావు నిలదీశారు. రాష్ట్రం ఏమైనా పరవాలేదు, నీటి ప్రాజెక్టులు లేకపోయినా పరవాలేదు అని కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మళ్లీ తెలంగాణను ఆంధ్రా చేతిలో పెడతారా? అంటూ కర్రుకాచి వాత పెడతారని హెచ్చరించారు.