పిలిచి పీఠం ఇస్తే పంగనామాలు, దాడులు చేశారు: కోదండపై హరీష్ తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఓసారి ఉద్యమం రోజులను గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి హరీష్ రావు సోమవారం అన్నారు. కాంగ్రెస్, టీడీపీలతో ఆయన ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఓయు వీద్యార్థులు ఉద్యమం చేస్తే కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు.
వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే, టిక్కెట్ల కోసం రచ్చరచ్చ
నాడు ఉద్యమం సమయంలో తెలంగాణ జేఏసీని విచ్ఛిన్నం చేయాలని అనుకున్న వారికి కోదండరాం ఇప్పుడు దగ్గరయ్యారని ఆరోపించారు. కోదండరాంకు పిలిచి సీటు ఇస్తే పంగనామాలు పెట్టారని వాపోయారు. అమరావతి, ఢిల్లీకి ఆయన గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రక్షణ కవచంలా నిలిచింది తెరాసనే
నాడు కోదండరాంకు రక్షణ కవచంలా నిలిచింది తెరాసనే హరీష్ రావు అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసినందుకు కోదండరాం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చావుకు కారణమైన వారితో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. గాంధీ భవన్ ఎదుట నాలుగు సీట్ల కోసం కోదండరాం పొర్లు దండాలు పెడుతున్నారని ఆరోపించారు. కోదండరాంను గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని గుర్తు చేశారు.
టీడీపీ వాళ్లు దాడులు చేశారు, కాంగ్రెస్ కేసులు పెట్టింది
తెలంగాణ కోసం పోరాటం చేస్తే టీడీపీ వాళ్లు దాడులు చేశారని హరీష్ రావు అన్నారు. ఉద్యమం సమయంలో కోదండరాం పైన కూడా కాంగ్రెస్ కేసులు పెట్టిందని చెప్పారు. ఉద్యమకారులను చట్టసభలకు పంపిన చరిత్ర తెరాసది అన్నారు. కూటమి లక్ష్యం ఏమిటో ప్రజలకు కోదండరాం చెప్పాలని అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించిన కోదండరాం, ఇప్పుడు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారన్నారు.
ఏ ప్రాజెక్టు ఆగిందో చెప్పాలి
చంద్రబాబు నాయుడు లేఖలతో తెలంగాణ ప్రాజెక్టులు ఆగాయన్న హరీష్ రావు వ్యాఖ్యలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి సోమవారం కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్కు ఎందుకు అధికారం ఇవ్వవద్దో తాము వంద ప్రశ్నలు వేస్తామని చెప్పారు. చంద్రబాబు ఉత్తరాల వల్ల ఏ ప్రాజెక్టు ఆగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రతిపక్షాలను కలుపుకుపోతామని చెప్పి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ కలుపుకొని పోయారని విమర్శించారు.
తెరాసకు సింగిల్ డిపాజిట్
కేసీఆర్ ఓట్ల కౌంటింగ్ కంటే ముందే నైతికంగా ఓడిపోయారని రావుల అన్నారు. చేసింది చెప్పుకొనే స్థాయిలో లేకపోవడం వల్లే అనవసరంగా చంద్రబాబును తిడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ను గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరో టీడీపీ నేత పెద్దిరెడ్డి చెప్పారు. ఆ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఉదయం మహాకూటమి అభ్యర్థులను ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు.