Scholarships: విద్యార్థులకు శుభవార్త.. త్వరలో ఉపకార వేతనాలు విడుదల..
తెలంగాణలో ఉపకారవేతనాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో స్కాలర్ షిప్ లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు ఇవ్వాల్సిన రూ.362.88 కోట్లను విడుదల చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలపై హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ యోగితా రాణా, తదితర అధికారులు హాజరయ్యారు.ఆరు శాఖలకు సంబంధించిన రూ362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
మార్చి నెలాఖరులోపు బిల్లులు అందకపోవడంతో తిరిగి పంపిన వివరాలను మళ్లీ ట్రెజరీకి సమర్పించాలని కోరారు. వీటిని వెంటనే క్లియర్ చేయాలని ట్రెజరీ అధికారులకు హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల బీఆర్వోలను కూడా విడుదల చేయాలన్నారు. ఉపకార వేతనాల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామని.. ఇప్పటికే చాలా ఆసల్యమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజ్ రిఇంబర్స్ మెంట్ రాక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు.