ఎన్టీఆర్ ఏడ్చేవారు: హరీష్, ఖేడ్ మాటేమిటి.. రేవంత్కు పల్లా కౌంటర్
మెదక్/ఖమ్మం/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని, అలాంటి బద్ధ శత్రువుతో పాలేరు ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ చేతులు కలపడం దిగజారుడుతనమని, ఎన్టీఆర్ బతికి ఉంటే దీనిని చూసి బాధపడేవారని, కన్నీరు పెట్టుకునే వారని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఆయన సోమవారం నాడు మెదక్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడంలేదన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేకే అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు.
టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, కానీ ఇవాళ ఆ పార్టీ కాంగ్రెస్తో జత కట్టిందని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకాన్ని అడ్డుకుంటోన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాలేరులో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
నాడు తెలంగాణ కోసం రాజీనామా చేసిన కేసీఆర్ పైన వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన వెంటనే జీవన్ రెడ్డి పోటీ చేయాలేదా? అని ప్రశ్నించారు. అచ్చంపేటలో కూడా అలాగే పోటీ చేసి ఓటమి చెందారన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో కూడా వారికి ఛేదు అనుభవం తప్పదన్నారు.
సంప్రదాయాలు పాటించలేదు: తెరాసపై రేవంత్ రెడ్డి
తెరాస విలువలు లేని పార్టీ అని, సంప్రదాయాలను పాటించడం లేదని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం విమర్శించారు. విలువలు కాపాడటంలో టిడిపి ముందుందని చెప్పారు. బద్ధ శత్రువు అయిన వైయస్ రాజశేఖర రెడ్డి వియంలోను తాము సంప్రదాయాలు పాటించామని గుర్తు చేశారు.
పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు తెరాస సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కెసిఆర్, కెటిఆర్ మానవత్వం లేనివారిలో ప్రవర్తిస్తున్నారని, రాంరెడ్డి సతీమణికి కెసిఆర్ అపాయింటుమెంటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. తాము మాత్రం ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్తామని చెప్పారు. తమ నిర్ణయానికి రాజకీయ రంగు సరికాదన్నారు. తుమ్మల నాగేశ్వర రావు మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ చేశారు.
రేవంత్కు పల్లా కౌంటర్
రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ ఉప ఎన్నికల విషయంలో సంప్రదాయాలు, విలువలు మాట్లాడటం విడ్డూరమన్నారు. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టిడిపి సంప్రదాయం ఏమయిందని ప్రశ్నించారు. ఏ విలువలతో వారు ఖేడ్లో పోటీ చేశారన్నారు. ఇప్పుడు ఓటమి తెలిసే వారు పోటీ నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు.