దామోదర సతీమణి బీజేపీలో చేరడంపై హరీష్ సెటైర్, చంద్రబాబుకు భయపడి: కవిత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింగ్, ఆ పార్టీ రూపొందించిన మేనిపెస్టో ఆయన కుటుంబ సభ్యులకే నచ్చలేదని, ఇక ప్రజలకు ఏం నచ్చుతుందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు గురువారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నచ్చకనే దామోదర రాజనర్సింహ సతీమణి పార్టీ మారారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఇచ్చే డబ్బుపై విజయశాంతి, నా పేరు చెడగొట్టాడు, నా తమ్ముడ్ని ఓడించండి: అరుణ
ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలది బానిస మనస్తత్వం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ ప్లాంట్ మూసివేస్తామని చెబుతున్నారని, ఇది కోమటిరెడ్డి మాటనా లేక కాంగ్రెస్ పార్టీ స్టాండా చెప్పాలని డిమాండ్ చేశారు.
వైయస్ నీరు తీసుకుపోతుంటే నోరు మూసుకున్నారు
కాంగ్రెస్ మేనిఫోస్టో పద్మినీ రెడ్డికి నచ్చనప్పుడు, ఇక ప్రజలకు ఏం నచ్చుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి నీళ్లు తీసుకుపోతుంటే పదవి కోసం పెదవి మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇస్తానంటే జానారెడ్డి విచిత్రం అన్నారని ఎద్దేవా చేశారు. 24 గంటలు కరెంట్ వెలుగులు వచ్చాయని, దీంతో కాంగ్రెస్ కరెంట్ పోయిందన్నారు.
గతంలో బీజేపీలో చేరాలనుకున్నా.. పద్మినీ రెడ్డి
పద్మినీ రెడ్డి బీజేపీలో, ఆమె భర్త దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీలో ఉండటంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం తప్పు కాదని చెప్పారు. దేవాలయ పునరుద్ధరణలో పద్మినీరెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. మోడీ పథకాలు నచ్చి తాను బీజేపీలో చేరానని పద్మినీ రెడ్డి చెప్పారు. మొదటి నుంచి మోడీ అభిమానిని అని చెప్పారు. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశానని అన్నారు.
కుంభమేళాలో తప్పిపోయిన వారిలా ఎల్ రమణ, జీవన్ రెడ్డి
కుంభమేళాలో విడిపోయి కలిసినట్లుగా జీవన్ రెడ్డి, ఎల్ రమణల ప్రెస్ మీట్ ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని వారిద్దరు అంటున్నారని, అసలు వారికి అమరుల త్యాగాలపై మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్లకు హక్కు లేదన్నారు. నాడు జీవన్ రెడ్డితో డీల్ కుదుర్చుకొని కేసీఆర్ పైన పోటీ చేశారన్నారు.
చంద్రబాబుకు భయపడి రమణ బయటకు రాలేదు
ఉద్యమంలో చంద్రబాబుకు భయపడి ఎల్ రమణ ఇంటి నుంచి బయటకు రాలేదని కవిత ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి కుటుంబం భూదందాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. జీవన్ రెడ్డి తమ్ముళ్లు భూదందాల్లో సిద్దహస్తులు అన్నారు. 2009లో జీవన్ రెడ్డి ఆస్తులు ఎంత, 2014లో ఎంతనో చెప్పాలన్నారు. జీవన్ రెడ్డి, ఎల్ రమణల కలయికను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ఒకరినొకరు నీచంగా తిట్టుకున్నారని, ఇప్పుడు ఎన్నికల్లో విలువలు మరిచారన్నారు. తోడేళ్లు ముసుగులు వేసుకొని వస్తున్నాయని, నమ్మి మోసపోవద్దన్నారు.
Recommended Video