విరాట్ కోహ్లీలా సెంచరీ కొడతాం: చంద్రబాబుతో పొత్తుపై హరీష్ రావు ఆగ్రహం
Recommended Video
సిద్దిపేట: టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు సమక్షంలో సిద్దిపేటకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతమంది పార్టీలో చేరితే అంత బాధ్యతగా ఉంటామని చెప్పారు. ఎంత మెజార్టీ పెరిగితే అంత సేవ చేస్తామని అన్నారు.
టీడీపీకి గట్టి షాక్: పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు ఆశలపై నీళ్లు?
రెండు జాతీయ రహదారులు సిద్దిపేటకు సాధించామని అన్నారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తెస్తామని చెప్పారు. ముప్పై రోజులు కష్టపడండి అని, 5 ఏళ్లు మీ కోసం కష్టపడతామని చెప్పారు. ఆంధ్రా పెత్తనం మనకు వద్దనే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు.
చంద్రబాబుతో పొత్తు అంటే తెలంగాణకు ద్రోహం
ఎవరి వల్ల తెలంగాణ ఆలస్యమయిందో అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పొత్తు అంటే తెలంగాణకు ద్రోహమే అన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బు కోసం పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, టీడీపీతో కలిసిన మహాకూటమికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
విరాట్ కోహ్లీలా సెంచరీ కొడతాం
సిద్దిపేటలో నిలబడటానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఢిల్లీకి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అమరావతికి, టీజీఎస్కు వేస్తే ఎటూ కాకుండా పోతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి పరంపర కొనసాగుతుందని అన్నారు. ఈసారి రికార్డు సష్టించి విరాట్ కోహ్లీలా సెంచరీ కొడుతామని చెప్పారు.
యాదవులు ఎటు ఉంటే అటు విజయం
న్యాయం, ధర్మం ఎక్కడ ఉంటే యాదవులు అక్కడ ఉంటారని హరీశ్ రావు అంతకుముందు అన్నారు. యాదవులు ఎటువైపు ఉంటే అటు విజయం తథ్యమన్నారు. యాదవుల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో మాట్లాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్ను కర్ణాటక నేత రేవణ్ణ ప్రశంసించారన్నారు. గజ్వేల్లో సీఎం కేసీఆర్కు మద్దతుగా యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేసీఆర్ నెంబర్ వన్గా నిలిపారు
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే అధిష్టానమని హరీష్ రావు చెప్పారు. ప్రతి ఊళ్లో అంగన్వాడీ భవనాలు, స్కూళ్లు నిర్మించామన్నారు. అభివృద్ధిలో గజ్వేల్ ముప్పై ఏళ్లు ముందుకు పోయిందన్నారు. గజ్వేల్ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని, యాదవులకు రాజ్యాధికారంలో వాటా దొరికిందని, యాదవ భవనం కోసం ఐదు ఎకరాల భూమి, రూ.5కోట్ల నిధులు కేటాయించామన్నారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి అభివృద్ధిని చూడలేకపోతున్నారు. గజ్వేల్ను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. అభివృద్ధిలో గజ్వేల్ నియోజకవర్గం నంబర్వన్గా నిలిచిందన్నారు.