హరీష్ వైపు ఆర్టీసీ కార్మికులు చూపు: రంగంలోకి దిగని ట్రబుల్ షూటర్: అడ్డుకుంటుందెవరు..!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వం..కార్మిక సంఘాలు మెట్టు దిగటం లేదు. ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలకు ససేమిరా అంటోంది. మంత్రులు వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ...కార్మిక సంఘాలకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి. కార్మిక సంఘాలు తప్పు చేస్తున్నాయంటూ తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకంటున్నారు. ఈ సమయంలో అసలు సమస్యకు పరిష్కార మార్గం కనిపించటం లేదు. అయితే..ప్రభుత్వంలో ఇంత మంది మంత్రులు ఈ అంశం పైన మాట్లాడినా ఇప్పటి వరకు ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు మాత్రం జోక్యం చేసుకోలేదు.
సమ్మె బాట పట్టిన 20వేల మంది హాల్ కార్మికులు...వేతనాల పెంపునకు డిమాండ్
ప్రస్తుతం సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో హరీష్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పై సంఘాలకు అభిమానం ఉంది. హరీష్ కొద్ది కాలం క్రితం వరకు ఈ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా పని చేసారు. హరీష్ మంత్రిగా జోక్యం చేసుకుంటే..సమస్య పరిష్కారం ఖాయమనే ప్రచారం కార్మిక సంఘాల్లో మొదలైంది. అసలు..హరీష్ ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు. హరీష్ రావును ఇందులో ప్రమేయం లేకుండా అడ్డుకుంటుందెవరు..
10వ రోజుకు చేరిన సమ్మె..పరిష్కారం మాత్రం..
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 10వ రోజుకు చేరింది. అటు కార్మిక సంఘాలు..ఇటు ప్రభుత్వం ఎవరికి వారు పంతానికి పోతున్నారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేతనాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రవాణా సదుపాయం లేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. కానీ, అటు ముఖ్యమంత్రిని కాదని ఇటు కార్మిక సంఘాలతో చర్చలకు..సంధి కుదిర్చే ప్రయత్నం జరగటం లేదు. ఆ సాహసం కూడా ఎవరూ చేయటం లేదు. ప్రతిపక్షాలు ఇదే అదనుగా ప్రభుత్వం మీద రాజకీయంగా దాడి చేస్తున్నాయి. సకల జనుల సమ్మెలో ఒక్కటిగా నిలిచిన అన్న రకాల ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చర్చలే లేవటోంది. దీంతో..అసలు పరిష్కార మాత్రం ఏంటనేది అంతు బట్టటం లేదు.
మంత్రులు వరుసగా..చెప్పిందే చెబుతూ..
ఇక, ముఖ్యమంత్రి చెప్పిన అంశాలనే మంత్రులు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. కార్మిక సంఘాలు తప్పు చేసాయని చెప్పటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పార్టీలను కార్నర్ చేయటానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ, అటు ముఖ్యమంత్రితో మాట్లాడి..ఇటు కార్మిక సంఘాలకు నచ్చ చెప్పి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొనే ధైర్యం ఏ మంత్రీ చేయటం లేదు. ఇక, ప్రజా సంఘాలు.. రాజకీయ పార్టీలు ఈ చొరవ తీసుకున్న అందుకు అనుకూల పరిస్థితులు లేవని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు సైతం సమస్య ఏదో రకంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. అందు కోసం ఆమోదయోగ్యమైన మార్గం కోసం నిరీక్షిస్తున్నారు.
ట్రబుల్ షూటర్ హరీష్ జోక్యం కోసం..
ప్రభుత్వంలో కీలక సమస్యలు వచ్చిన సమయంలో సీనియర్ నేత..మంత్రిగా ఉన్న హరీష్ సాధారణంగా పరిష్కారానికి ముందుకు వస్తారు. అందునా ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ యూనియన్ ఏర్పాటులో ఆయనే పెద్ద మనిషిగా వ్యవహరించారు. యూనియన్ కు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించి..కొద్ది నెలల క్రితం తప్పుకున్నారు. కానీ, ఆ సంఘాల మీద హరీష్ కు మంచి పట్టు ఉంది. హరీష్ మాట్లాడితే కార్మిక సంఘాలు సైతం నో అని చెప్పే పరిస్థితి లేదని కార్మిక నేతలే అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అయితే.. హరీష్ మాత్రం ప్రస్తుతం హుజూర్ నగర్ మీద ఫోకస్ అయి ఉన్నారు.
హరీష్ దూరంగా ఉండటం వెనుక..
మంత్రులు వరుసగా ఈ అంశం మీద మాట్లాడుతున్నారు. కానీ, హరీష్ మాత్రం నోరు విప్పలేదు. ముఖ్యమంత్రి మూడ్ గమనించే హరీష్ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే అటు ప్రభుత్వ విలువ కార్మికులకు తెలిసే విధంగా చేస్తూనే...వారిని సమ్మె విరమించే విధంగా హరీష్ చేయగలరని ప్రభుత్వంలో సైతం చర్చ సాగుతోంది. అయితే..ముఖ్యమంత్రి కార్మిక సంఘాల తీరు పైన ఆగ్రహంగా ఉండటం..ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో హరీష్ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే..కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం..విద్యా సంస్థలకు సెలవులు.. సమ్మె 10వ రోజుకు చేరటంతో ప్రభుత్వం సైతం పట్టదలకు పోకుండా..సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం..అదే విధంగా కార్మిక సంఘాల నేతలు సైతం మెట్టు దిగటం అవసరంగా కనిపిస్తోంది. మరి.. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ పరిస్థితిన ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాలి.